టిడిపి గూండాలు కేశినేని, బోండాల్ని అరెస్ట్ చేయాలి: సభలో గందరగోళం
రవాణా శాఖ అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమలను అరెస్ట్ చేయాలని వైసిపి నేతలు శాసన సభలో డిమాండ్ చేశారు.
అమరావతి: రవాణా శాఖ అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమలను అరెస్ట్ చేయాలని వైసిపి నేతలు శాసన సభలో డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. పోలీసుల ఓవరాక్షన్ తగ్గించాలని, రౌడీరాజ్యం, గూండారాజ్యం అని నినదించారు.
ఐపీఎస్ అధికారులపై టిడిపి నేతల దౌర్జన్యం ఆపాలన్నారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు. రైల్వే కాంట్రాక్టర్లకు కూడా రక్షణ కల్పించాలన్నారు. టిడిపి గూండాలను అరెస్ట్ చేయాలన్నారు. సభలో గందరగోళం చెలరేగింది.
సోమవారం శాసన సభలో ఈ అంశం వేడి రాజేసిన విషయం తెలిసిందే. వాయిదా అనంతరం సభ ప్రారంభమైంది. ఈ సమయంలో వారిని అరెస్ట్ చేయాల్సిందేనని వైసిపి డిమాండ్ చేసింది. దాడి చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా అన్నారు. టిడిపి నేతలు మాట్లాడుతుండగా వైసిపి పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపింది.
'దొంగల రాజ్యం- గూండా రాజ్యం', 'టిడిపి గూండాలను అరెస్ట్ చేయాలి', 'అధికారులకు రక్షణ కల్పించాలి', 'టిడిపి నేతల దౌర్జన్యం ఆపాలి', 'టిడిపి నుంచి రక్షణ కావాలి' అని వైసిపి సభ్యులు నినాదాలు చేశారు.