నీరో చక్రవర్తిలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారు.. ఏపీ మంత్రులు రెచ్చిపోకండి : చంద్రబాబు
Recommended Video
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై మండిపడుతున్నారు . వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అని విమర్శలు గుప్పిస్తున్న ఆయన ఇసుక కొరత వ్యవహారంలో జగన్ తీరు విస్మయానికి గురి చేస్తుందని అన్నారు .ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిపాలనా విధానం సరిగా లేదంటూ ధ్వజమెత్తిన ఆయన ఏపీలో గత ఐదు నెలలుగా పాలన కుంటుపడిందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న బాబు జగన్ పాలనపై విమర్శలు చేశారు.

జగన్ విలాసవంతంగా ఇంట్లో ఉంటున్నారని ట్వీట్ చేసిన చంద్రబాబు
ఇక నేడు జగన్ పాలనా తీరుతో రాష్ట్రం ఆర్థికభారంతో సతమతమవుతోందని, మరోవైపు భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. ఇక జగన్ పాలనకు నీరో పాలనకు తేడా లేదన్నారు. రాష్ట్రం ఇంతగా రగిలిపోతుంటే జగన్ మాత్రం తన విలాసవంతమైన ఇంట్లో కూర్చుని వీడియో గేములు ఆడుకుంటూ బిజీగా ఉన్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు జగన్ తీరు అన్న మాజీ సీఎం
జగన్ తీరు చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు చంద్రబాబు. జగన్ నివాసం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.15.65 కోట్లు తరలి వెళ్లడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.ఇక చిత్తూరులో సిద్ధాంతపరంగా ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పోరాటం చరిత్రలో నిలుస్తుందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ డీజీపీపై వ్యాఖ్యలు చేసిన బాబు లా అండ్ ఆర్డర్ గురించి డీజీపీ తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం సరికాదన్నారు.

జైలుకు వెళ్లొచ్చినా జగన్ అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారని ఆగ్రహం
వీసీలను కూడా బెదిరించి రాజీనామాలు చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు . జైలుకు వెళ్లొచ్చినా జగన్ అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై తన పార్టీ కార్యకర్తలు ప్రైవేటు కేసులు పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో టిడిపి అధ్యక్షుడు తన పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎంతకాలం మంత్రులుగా ఉంటారు.. ఏపీ మంత్రులకు బాబు వార్నింగ్
సిఎం, ఆయన మంత్రులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని టిడిపి చీఫ్ ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రిపై మాజీ సిఎం పేరు ప్రస్తావించకుండా విరుచుకుపడ్డారు.వైఎస్ఆర్సిపి తమ గ్రామాల్లో టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ఆయన మంత్రిని హెచ్చరించారు. ఈ మంత్రులు ఎంత కాలం ఉంటారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డిజిపి వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications