22నుంచి తెలంగాణ బడ్జెట్ .. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే ..
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 22 నుంచి సమావేశాలను నిర్వహిస్తామని ప్రకటించింది. 22 నుంచి 25 వరకు సెషన్ కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి.
వచ్చే శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ... రాష్ట్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ఇద్దరితో క్యాబినెట్ ఉన్నందున సీఎం కేసీఆరే బడ్జెట్ ప్రవేశపెడతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం లేకపోవడంతో .. బడ్జెట్ ను కేసీఆర్ ప్రవేశపెడతారనే వాదనకు బలం చేకూరింది.
శనివారం (23)న బడ్జెట్ పై సభలో చర్చ జరుగనుంది. 24 ఆదివారం అసెంబ్లీకి సెలవు ఉన్నందున 25వ తేదీని ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. లోక్ సభ ఎన్నికలు ముగిసాక .. కేంద్రం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత రాష్ట్రంలో కూడా మిగతా పథకాలకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది.