హైదరాబాద్లో వర్ష బీభత్సం: కాలనీల్లోకి చేరిన వరదనీరు, పలుచోట్ల నో పవర్
గులాబ్ తుఫాన్ తీరం దాటడంతో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇక మహానగరం హైదరాబాద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చినుకు పడితే చాలు చిత్తడి అయే సిటీలో.. ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో కాలనీలు/ గల్లీలోకి భారీగా నీరు చేరింది. వర్షం పడటంతో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బల్దియా అధికారులు సూచించారు.
భారీ వర్షం..
హైదరాబాద్ సిటీలో సాయంత్రం నుంచి అతి భారీవర్షం ముంచెత్తుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మాన్సూన్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడిపోసే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో గత మూడు గంటల నుంచి భారీ వర్షం పడుతుండడంతో ప్రధాన రహదారులపై వరద పోటెత్తింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా స్థానికులు మ్యాన్ హోల్స్ మూతలు తెరిచారు. మరో నాలుగైదు గంటల పాటు భారీ వర్షం పడుతుందని జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసుల సూచిస్తున్నారు. బయట ఉన్నవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాలు..
తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్లో కురుస్తోన్న వర్షాలతో నగరమంతా జలమయమైంది. దీంతో రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి. దారులన్నీ మూసుకుపోవడంతో ప్రజలు ఇళ్లకు చేరడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆగిపోయిన నీటిని క్లియర్ చేసేందుకు డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ టీమ్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మ్యాన్ హోల్స్ వంటివి ఓపెన్ అయి ఉంటాయని గమనించి రోడ్డుపై ప్రయాణించాలని వాహనదారులకు, పాదచారులకు అధికారులు సూచిస్తున్నారు.
Recommended Video
కాలనీల్లోకి వరదనీరు
హైదరాబాద్ అంతా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు చేరింది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చీకటి అలుముకుంది. పట్టపగలే కారు చీకటి అలముకుంది. కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.