రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తహశీల్దార్పై పెట్రోల్ పోసిన దుండగులు.. తీవ్రగాయాలతో మృతి
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అబ్దుల్లాపూర్మెట్లో తహశీల్దార్ విజయారెడ్డిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమెను కాపాడేందుకు ఇద్దరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పూర్తిగా కాలిపోయిన విజయారెడ్డి మృతిచెందారు. విజయారెడ్డిని వారు ఎందుకు టార్గెట్ చేశారనే అంశంపై క్లారిటీ రాలేదు.
1.30 గంటలకు ఘటన
మధ్యాహ్నం 1.30 గంటలకు తహశీల్దార్తో మాట్లాడాలని దుండగులు లోపలికి వెళ్లారు. దాదాపు అరగంట ఛాంబర్లో ఉన్నారు. బయటకొచ్చిన వెంటనే విజయారెడ్డి కూడా వచ్చారు. అయితే మంటలు అంటుకోవడంతో ఏం జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. అక్కడే ఉన్న ఇద్దరు ప్రాణాలకు తెగించి కాపాడబోయారు. అప్పటికే తీవ్రగాయాలైన విజయారెడ్డి మృతిచెందారు. తహశీల్దార్కు నిప్పంటించిన దుండగులు వెంటనే పీఎస్లో లొంగిపోయారు. వారు ఎందుకు విజయారెడ్డిని టార్గెట్ చేశారనే అంశం తేలాల్సి ఉంది.
మాటల్లో పడేసి
మాట్లాడుతానని చెప్పి వెళ్లిన దుండగుడు పెట్రోల్ పోయడం కలకలం రేపింది. ఆదివారం సెలవు కావడంతో.. సోమవారం కార్యాలయానికి చాలా మంది వచ్చారు. అయితే అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ కార్యాలయం మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అక్కడ విజయారెడ్డితో మాట్లాడి.. వచ్చే సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె బయటకు వచ్చే లోపలే పూర్తిగా మంటలు అంటుకున్నాయి. ఇద్దరు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె పూర్తిగా కాలిపోయి కూలిపోయింది.
రెచ్చిపోయిన దుండగుడు
దాడి ఎందుకు జరిగిందనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు. రిజిస్ట్రేషన్ కోణంలో దాడి జరిగిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్జిదారుడు తన భూమి రిజిస్ట్రేషన్ కోసం పలుమార్లు కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చాలారోజుల నుంచి పనిచేస్తానని చెప్పి.. కాలం వెళ్లదీస్తున్నారని సమాచారం. తహశీల్దార్ను మట్టుబెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన వచ్చినట్టు తెలిసింది. అటెండర్, మరో ఉద్యోగి కూడా కాపాడేందుకు ప్రయత్నం చేసి.. తీవ్రగాయానికి గురయ్యారు.
ఖండించిన రెవన్యూ సంఘం
మరోవైపు తహశీల్దార్ హత్యను రెవెన్యూశాఖ ఖండించింది. మండల మేజిస్ట్రేట్ను మట్టుబెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించింది. హేయమైన చర్య అని రెవెన్యూ అసోషియేషన్ మండిపడింది. దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తప్పుడు పనులు చేయనందుకే కక్షగట్టి దాటికి పాల్పడుతున్నారని రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మహిళ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. రెవెన్యూ పనులే కాక ఇతరుల పనులు చేయడం వల్లే పనిభారం పడుతుందని చెప్పారు. కల్యాణలక్ష్మీ; షాదీ ముబారక్ పనులు తమ పరిధిలోని అంశం కాదని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు విజయారెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు.