డ్రగ్స్ ముఠాలో దేవాలయ అర్చకుడు ... తెలంగాణలో సంచలనం
డ్రగ్స్ ముఠాలో పోలీసులకు చిక్కిన ఓ అర్చకుడి ఉదంతం తెలంగాణా రాష్ట్రంలో కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన కోటి రూపాయల విలువచేసే కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ రవాణా ముఠా సభ్యులలో మహబూబాబాద్ జిల్లా అనంతాద్రి దేవాలయ అర్చకుడు గుడవర్తి చక్రధరాచార్యులు ఉండడం షాక్ కు గురి చేసింది. అర్చకత్వంతో , భగవంతుని సేవలో ఉండాల్సిన అర్చకుడు డ్రగ్స్ ముఠా లో ఉండటంతో అసలీ డ్రగ్స్ రాకెట్లో ఎవరెవరున్నారు అన్న అనుమానాలకు కారణమవుతుంది.
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత .. నలుగురి ముఠా అరెస్ట్ , కోటి విలువచేసే డ్రగ్స్ స్వాధీనం
డ్రగ్స్ ముఠాలో అనంతాద్రి దేవాలయ అర్చకుడు
గుడవర్తి చక్రధరాచార్యులు.. అనంతాద్రి దేవాలయ అర్చకులుగా మానుకోట వాసులందరికీ తెలుసు. అయితే ఈ అర్చకుడు అర్చకత్వం ముసుగులో ఆయనలో మరో కోణం ఉన్నదని నిన్నటి వరకు ఎవరికీ తెలీదు. హైదరాబాద్ లో తాజాగా పట్టుకున్న డ్రగ్స్ ముఠా లో అనంతాద్రి దేవాలయ అర్చకులుగా పనిచేస్తున్న గుడవర్తి చక్రధరాచార్యులు ఉండడం రాష్ట్ర వ్యాప్త చర్చకు కారణమవుతోంది. హైదరాబాద్, చెన్నై, వైజాగ్ కేంద్రాల్లోని కళాశాల విద్యార్థులు టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ ముఠాకు మహబూబాబాద్ ప్రాంత అర్చకుడు సహకరించినట్లుగా తెలుస్తోంది.
డబ్బుల కోసం డ్రగ్స్ దందా చేస్తున్న అర్చకుడు
మాదకద్రవ్యాలను విక్రయించడం ద్వారా లక్షల్లో ధనార్జన చేయవచ్చన్న దురాశతో గుడవర్తి చక్రధరాచార్యులు ఈ దందాలో కి దిగినట్లుగా తెలుస్తోంది. ఆయన తన డ్రైవర్ తో కలిసి డ్రగ్స్ సరఫరా చేయడంలో భాగంగా నెల్లూరుకు వెళ్ళినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు గుడవర్తి చక్రధరాచార్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అర్చకుడిలా ఈ ముఠాలో ఇంకెందరో ? దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అనంతాద్రి అర్చకుల తరహాలో, ఇంకా ఈ ముఠా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటి రూపాయల విలువచేసే మాదకద్రవ్యాలను సరఫరా చేస్తూ పట్టుబడిన ముఠాలో అర్చకుడు ఉండటం అటు రాష్ట్ర ప్రజలనే కాదు పోలీసులను కూడా విస్మయానికి గురి చేసింది. వీరిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఠాకు సహకరిస్తున్న గ్యాంగ్ ఎవరో బయటకు వచ్చే అవకాశం ఉంది.