tsrtc strike: కార్మికుల్లో లుకలుకలు..? సీఎం వార్నింగ్తో చీలిక, అశ్వత్థామరెడ్డిపై డ్రైవర్ ఫిర్యాదు
టీఎస్ఆర్టీసీ కార్మికుల్లో లుకలుకలు మొదలయ్యాయా ? గత 20 రోజులుగా సమిష్టిగా సమ్మె చేస్తోన్న కార్మికుల్లో చీలిక వచ్చిందా ? అంటే ఔననే సమాధానం వస్తోంది. దీనికి ఆర్టీసీ డ్రైవర్ తమ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కార్మికులు రెండువర్గాలుగా చీలిపోయారా అనే అనుమానం కలుగుతోంది. సమ్మె చేస్తామని చెప్పిన తర్వాత కేవలం కొందరు కార్మికులే విధుల్లో చేరారు. 48 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్.. ఆర్టీసీ లేదని, ముగిసిన అధ్యాయం అని కామెంట్ చేయడం చర్చకు దారితీసింది.
సమ్మె నీరుగారిపోతోందా ..?
సీఎం కేసీఆర్ కామెంట్ చేసిన తర్వాత వెంటనే ఆర్టీసీ డ్రైవర్ ఒకరు బయటకొచ్చారు. కూకట్పల్లి డిపోకు చెందిన డ్రైవర్ కోరెటి రాజు పోలీసులను ఆశ్రయించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కూకట్పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అశ్వత్థామరెడ్డి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఆత్మహత్యకు కూడా అశ్వత్థామరెడ్డి కారణం అని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో సమ్మె చేస్తున్న డ్రైవర్ తమ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చానీయాంశమైంది.
కేసీఆర్ వార్నింగ్
సమ్మె చేపట్టడానికి ముందే కార్మికులను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 5వ తేదీ సాయంత్రం వరకు విధుల్లో చేరిన వారిని కార్మికులుగా గుర్తిస్తామని, మిగిలిన వారు సెల్ప్ డిస్మిస్గా పరిగణిస్తామని పేర్కొన్నారు. దీంతో కొందరు భయపడి విధుల్లో చేరారు. కానీ తర్వాత ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ప్రత్యామ్నాయంగా బస్సులను నడిపించడం, హైకోర్టు కలుగజేసుకోవడంతో ప్రభుత్వం కూడా తమ వాదనను తెలియజేస్తోంది. ఇది ఇలా ఉంటే.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు ఇచ్చారు.
ముగిసిన అధ్యాయమే అనడంతో..
ఆర్టీసీ కార్పొరేషన్ లేదని, ముగిసిన అధ్యాయం అని కేసీఆర్ నోట రావడంతో కొందరు కార్మికులు బయటపడ్డారు. ఏం చేయాలా అని మదనపడిపోతున్నారు. 48 వేల మంది కార్మికుల్లో కొందరు విధుల్లో చేరతారని అంచనాలు ఉన్నాయి. కానీ మరునాడే ఆర్టీసీ డ్రైవర్ అశ్వత్థామరెడ్డిపై ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగిస్తోంది. దీనినిబట్టి చూస్తే మరికొందరు కూడా ముందడుగు వేసి.. సమ్మెకు టాటా, బైబై చెబుతారనే అంచనాలు కూడా ఉన్నాయి. సీఎం అంచనా వేసినట్టు కార్మికులు సమ్మె వీడితే.. తిరిగి ఆర్టీసీ కార్మికుల విధుల్లో ప్రగతిరథ చక్రాలు కదిలే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే సమ్మె అనే అంశం నీరుగారిపోయినట్టు అని అనిపిస్తోంది.
వాట్ నెక్ట్స్..
సీఎం కేసీఆర్ కామెంట్ల తర్వాత వెంటనే స్పందించిన అశ్వత్థామరెడ్డి.. ఆర్టీసీని, కార్మికుల గురించి మాట్లాడారు. కానీ వారిలో తనపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు మరింత కృషి చేయలేదని అర్థమవుతోంది. డ్రైవర్ రాజు ఫిర్యాదుతో మరికొందరు సాహసం చేసే అవకాశం ఉంది. వెంటనే కార్మిక నాయకులు మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టి, మరింత బలంగా మారాతారా.. లేదా సమ్మె నీరుగారిపోతోందా అనే అంశం చర్చకు దారితీసింది.