ఫైండింగ్ ఫోని: తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలోనే కన్నుతెరిచిన పసిగుడ్డు
భువనేశ్వర్ః ఒకవంక చండ ప్రచండ ఫోని తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోన్న సమయంలోనే ఓ పసిగుడ్డు కన్ను తెరిచింది. ప్రకృతి విలయానికి సాక్షిగా నిలిచింది. శుక్రవారం ఉదయం ఫోని తుఫాన్ ఒడిశాలోని పూరీ తీరాన్ని తాకిన అదే క్షణాన జన్మించిందా పసిపాప. ఆ పాపకు ఫోని నామకరణం చేశారు తల్లిదండ్రులు. అత్యంత అరుదైన ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్లో చోటు చేసుకుంది.
నాలుగు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫోని తుఫాన్ ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరీ వద్ద తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో భువనేశ్వర్లోని మంచేశ్వర్ ప్రాంతంలో రైల్వే ఆసుపత్రిలో ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలోనే జన్మించినందున ఆ పసిగుడ్డుకు ఫోని అని నామకరణం చేశారు. ఆ బిడ్డ తల్లి ఓ రైల్వే ఉద్యోగిని. మంచేశ్వర్లోని రైల్వే వర్క్షాప్, కోచ్ రిపేర్ వర్క్షాప్లో పనిచేస్తున్నారు.