విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్: కాంగ్రెసు మద్దతు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. మూజువాణీ ఓటుతో ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వాస పరీక్షలో నెగ్గింది. ప్రభుత్వానికి 8 మంది కాంగ్రెసు సభ్యులు, ఒక జెడియు సభ్యుడు మద్దతు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 శాసనసభ స్థానాలున్నాయి. ఈ సంఖ్యా బలంతో 70 స్థానాలున్న శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వాస పరీక్షను గట్టెక్కింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా బిజెపి సభ్యులు ఓటేశారు. విశ్వాస పరీక్షపై జరిగిన చర్చలో కాంగ్రెసు, బిజెపిలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చూస్తూ ఉండిపోయారు.
అమ్ అద్మీపార్టీ (ఏఏపీ) దేశానికి ప్రమాదకరమని బీజేపీ సీనియర్ నేత హర్షవర్ధన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీతో ఏఏపీ చేతులు కలడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. గురువారం ఏఏపీ విశ్వాస తీర్మానంపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్తో చేతులు కలపడానికి కారణాలేంటో కేజ్రీవాల్ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజాయితీగల పార్టీకి ఓటేయాలని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారని, అందుకే నిజాయితీ గల బీజేపీకే ప్రజలు ఓటేశారని, అసెంబ్లీలో ఎక్కువ సీట్లు తమకే వచ్చాయని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. కాగా కాంగ్రెస్ పార్టీ కూడా విప్ జారీ చేయడంతో ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గడం లాంఛనప్రాయమే అయ్యింది.