సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో అడ్మిట్: జీనోమ్ సీక్వెన్స్ టెన్షన్: ఒక్కరోజులో 75 ఒమిక్రాన్ కేసులు
కోల్కత: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే- ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 75 కొత్త ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారి సంఖ్య 653కు చేరింది. ఒమిక్రాన్ వల్ల ఇప్పటిదాకా మరాణాలేవీ నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది.
653కు చేరిన ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియంట్ 21 రాష్ట్రాలకు విస్తరించింది. కొత్తగా మణిపూర్, గోవా ఒమిక్రాన్ బాధిత రాష్ట్రాల జాబితాలో చేరాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 653కు చేరగా.. ఇందులో 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 467గా రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలవారీగా వాటి సంఖ్యను వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్రల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు చోట్ల కూడా 332 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇందులో మహారాష్ట్ర-167, ఢిల్లీ-165 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
మూడో స్థానంలో తెలంగాణ..
మహారాష్ట్రలో 61, ఢిల్లీలో 23 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. మూడో స్థానంలో కేరళ నిలిచింది. ఇక్కడ 57 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ-55 గుజరాత్-49, రాజస్థాన్-46 కేసులు రికార్డయ్యాయి. తమిళనాడు-34, కర్ణాటక-31, మధ్యప్రదేశ్-9, ఆంధ్రప్రదేశ్-6, పశ్చిమ బెంగాల్-6, హర్యానా-4, ఒడిశా-4, చండీగఢ్-3, జమ్మూ కాశ్మీర్-3, ఉత్తర ప్రదేశ్-2 కేసులు రికార్డయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, లఢక్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లల్లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సౌరవ్ గంగూలీకి కరోనా
కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ సౌరవ్ గంగూలీ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కూడా ఆయన ఈ మహమ్మారి బారిన పడటం చర్చనీయాంశమైంది. ఆయన సోదరుడు స్నేహాశీష్ గంగూలీకి కూడా కరోనా వైరస్ సోకింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌరవ్ గంగూలీకి ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో అడ్మిట్..
వెంటనే ఆయనను కోల్కతలోని వుడ్ల్యాండ్స్ నర్సింగ్ హోమ్కు తరలించారు. ప్రత్యేక ఐసొలేషన్ వార్డులో చేర్చారు. డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తోన్నారు. సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించినట్లు చెప్పారు. ఇదివరకు గుండెపోటు వచ్చినప్పుడు ఆయన ఇదే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. యాంజియోప్లాస్టీ నిర్వహించారు.
Recommended Video
బెంగాలీ సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ ప్రీమియర్ షోలో..
సౌరవ్ గంగూలీ ఈ నెల 24వ తేదీన బెంగాలీ సూపర్ స్టార్, తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు దేవ్ నటించిన తాజా సినిమా టానిక్ ప్రీిమియర్ షోనకు హాజరయ్యారు. నుస్రత్ జహా, యష్, బాబుల్ సుప్రియో, తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రాలతో సన్నిహితంగా గడిపారు. దీనితో వారికి కూడా వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ కావడం మూడోసారి. రెండుసార్లు గుండెపోటుతో ఆయన వుడ్ల్యాండ్స్ నర్సింగ్ హోమ్లో చేరారు. ఇప్పుడు మళ్లీ అదే క్లినిక్లో అడ్మిట్ అయ్యారు.