బెంగుళూరు బిపివో ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్: ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: బెంగుళూరులోని ఓ కాల్ సెంటర్లో పని చేసే ఉద్యోగినిపై కదులుతున్న వ్యాన్లో అత్యాచారం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అక్కడి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ ఎన్ ఎస్ మేగారిక్ మంగళవారం వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని, దుండగులను గుర్తించామన్నారు. అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటనలో బిపివోలో పని చేసే ఓ యువతిని వ్యానులో ఎక్కించుకుని నగరంలో తిప్పుతూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు.
అనంతరం ఆమెను కత్తితో బెదిరించి డ్రైవర్, క్లీనర్ అత్యాచారం చేశారు. 26 ఏళ్ల బాధితురాలి స్వస్థలం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. హోసూరు మార్గంలో మడివాళ సమీపంలోని ఇంటి నుంచి బాధితురాలు దొమ్మలూరులో తాను పనిచేసే కాల్సెంటర్కు వెళ్లడానికి శనివారం రాత్రి 9.30 గంటలప్పుడు బస్టాప్కు చేరుకుంది.
కాసేపటికే అక్కడకు ఓ వ్యాన్ వచ్చింది. ఇది కాల్సెంటర్ ఉద్యోగులను కార్యాలయానికి తరలించే వాహనాన్ని పోలి ఉంది. ఆ కారు డ్రైవర్ ఆమెను పలుకరించి, దొమ్మలూరులోని కాల్సెంటర్కే వెళ్తున్నట్లు నమ్మబలికాడు. ఆమె వాహనంలోకి ఎక్కింది.
అందులో మరో ఇద్దరు యువకులు ఉండటాన్ని ఆమె గుర్తించింది. అనుమానం వచ్చి ఆమె అప్రమత్తమయ్యేలోపే, కామాంధులు దారుమానికి ఒడిగట్టారు. బెంగళూరు వీధుల్లో చక్కర్లు కొడుతూ వాహనంలోనే ఆమెపై వరుస లైంగిక దాడులకు దిగారు. రెండు గంటల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారు.
అపస్మారక స్థితిలోకి చేరడంతో, భయంతో దొమ్మలూరులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో కిందకు తోసేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో కొందరు ఆటోవాలాలు ఆమెను చూసి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.