ములాయం కనబడుట లేదంటూ పోస్టర్లు... నేతాజీ జనవరిలో వస్తారు..!
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ చీఫ్, అజంఘర్ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ కనిపించడం లేదంటూ బీజేపీ పోస్టర్లను ముద్రించింది. సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు సహా ఎవరైనా తన నియోజకవర్గానికి తీసుకురావాలని... అలా తీసుకువచ్చిన వారికి నగదు పురస్కారంతో సన్మానం చేస్తామంటూ ములాయం ఫోటోతో పోస్టర్లు వెలిశాయి.
భారతీయ జనతా పార్టీ మైనారిటీ వింగ్ కార్యకర్తలు చేస్తున్న పోస్టర్ల ప్రచారం అజంఘర్లో కలకలం రేపుతోంది. సఘ్రీ తెహసిల్, చుట్టుప్రక్కల ప్రాంతాలలో పోస్టర్లను అంటించామని, ములాయంను అజంఘర్కు తీసుకొచ్చిన ఎవరికైనా నగదు అందజేస్తామని కూడా ప్రకటించామని బీజేపీ మైనారిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు సోఫియా ఖాన్ చెప్పారు.
ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మణిపురి, అజంఘర్ స్థానాలకు పోటీచేసిన సమాజ్వాదీ పార్టీ అధినేత తన ప్రత్యర్ధి బీజేపీ నేత రమాకాంత్ యాదవ్పై 63,204 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తరువాత మణిపురి స్థానానికి రాజీనామా చేసి అజంఘర్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
వారణాసికి అప్పటి ప్రధానమంత్రి మంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ బయటి వ్యక్తని ఎన్నికల సమయంలో ములాయం వ్యాఖ్యానించారని, కానీ గెలిచాక ప్రధాని హోదాలో ఉండి కూడా మూడుసార్లు ఆ ప్రాంతంలో పర్యటించారని ఖాన్ అన్నారు.
అజంఘర్కు ఎంపీ అయిన ములాయం యాదవ్ సింగ్ తన నియోజకవర్గ ప్రజలను పట్టించుకునేందుకు సమయమే కేటాయించడం లేదని అన్నారు. తన పార్లమెంట్ నియోజక వర్గంలో ఇప్పుడో బయటి వ్యక్తిలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అంతక ముందు 15 రోజుల క్రితం బీజేపీ జిల్లా అధ్యక్షుడు షహ్జంద్ రాయ్ పార్టీ కార్యకర్తలతో "లాంతర్ మార్చ్" నిర్వహించారు. ఆ సందర్భంలో రాయ్ మాట్లాడుతూ ఎంపీని వెతికి పట్టుకునేందుకు లాంతర్ ఒక సింబల్గా ఉపయోగించామని అన్నారు.
బీజేపీ పోస్టర్ల కలకలంపై సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్పందించారు. బీజేపీ నిరాధారమైన ఆరోపణలతో ములాయంపై ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఎంపీ నిధులతో అజంఘర్లో పనులు ప్రారంభించామని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ములాయం యాదవ్ సింగ్ ఫోటోలు ఉన్నాయని అన్నారు.
అజంఘర్లో 24 గంటల పాటు విద్యత్ ఉంటుందని, జిల్లా సమాజ్వాదీ పార్టీ ఆఫీస్కు వచ్చిన ఫిర్యాదులను నేతాజీ (ములాయం) సరిచేస్తున్నారని పేర్కొన్నాడు. జనవరిలో ములాయం సింగ్ యాదవ్ తన పార్లమెంట్ నియోజక వర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు.