కేజ్రీవాల్ సునామీ: బిజెపిపై తిరగబడిన జోక్, ఆటో సరి
న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సునామీకి తట్టుకుని నిలబడిన బిజెపి అభ్యర్థులు ముగ్గురు మాత్రమే. కాంగ్రెసుకు చెందిన 44 మంది లోకసభ సభ్యులు పార్లమెంటుకు వోల్వో బస్సులో రావచ్చునని బిజెపి హేళన చేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల విషయంలో అదే జోక్ బిజెపిపై విసిరే వరిస్థితి. ముగ్గురు బిజెపి శాసనసభ్యులు బస్సు మాట అటుంచి, ఆటోలో వెళ్లవచ్చునని హాస్యమాడే అవకాశాన్ని తెచ్చుకుంది.
బిజెపి నుంచి గెలిచిన ముగ్గురు అభ్యర్థులు జగదీష్ ప్రధాన్, ఓమ్ ప్రకాశ్ శర్మ, విజేందర్ గుప్తా. వీరు ముగ్గురు మాత్రమే తమ తమ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సునామీని తట్టుకుని విజయం సాధించారు. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఆటోలో ప్రయాణించవచ్చు.
బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా తన రోహిణి సీటును నిలబెట్టుకున్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సిఎల్ గుప్తాను 5000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. రెండో సీటు విశ్వాస్ నగర్ నియోజకవర్గం. ఈ స్థానంలో బిజెపికి చెందిన ఓమ్ ప్రకాశ్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన డాక్టర్ అతుల్ గుప్తాను ఓడించారు. ఆయన 11 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
బిజెపి గెలిచిన మరో సీటు ముస్తఫాబాద్. ఈ స్థానంలో జగదీష్ ప్రధాన్ సిట్టింగ్ శాసనసభ్యుడు హసన్ అహ్మద్ను 5000కు పైగా మెజారిటీతో ఓడించారు. కృష్ణానగర్ నియోజకవర్గం బిజెపికి కంచుకోట. ఆ స్థానంలో బిజెపి ముఖ్యమంత్రి కిరణ్ బేడీ ఓడిపోవడం బిజెపికి తిరుగులేని దెబ్బ. ఇంతకు ముందు ఈ సీటుకు హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహించారు.