హజ్ యాత్ర మరింత భారం: 2 ఏళ్లకు మించితే టికెట్
న్యూఢిల్లీ: హజ్ యాత్రకు వెళ్లే చిన్న పిల్లల విషయంలో కేంద్ర హజ్ కమిటీ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇకపై హజ్ యాత్రకు రెండేళ్లు నిండిన పిల్లలకు సగం టికెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు రెండేళ్ల లోపు చిన్న పిల్లలకు మాత్రం హజ్ యాత్రకు అయ్యే మొత్తం ఖర్చులో పదిశాతం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ సరికొత్త నిబంధనపై సోషల్ ఆర్గనైజేషన్ అయిన బారెల్లీ హజ్ సేవా సమితి నిరసన వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్, సెంట్రల్ హజ్ కమిటీకి లేఖ రాసింది. హజ్ యాత్రకు మహిళలు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ నిబంధన తెరపైకి తెచ్చారని ఆరోపించింది.
ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు లోబడిన పిల్లలకు టికెట్ తీసుకునే విషయంలో మినహాయింపు ఉంది. ‘‘హజ్ యాత్రకు వెళ్లకుండా మహిళలను అడ్డుకునేందుకు ఈ నిబంధనను తీసుకొచ్చారు. బస్సులు, రైళ్లలోనూ ఐదేళ్ల లోపు పిల్లలకు టికెట్ తీసుకోరు. ఎందుకంటే వారు తమ తల్లిద్రండుల ఒళ్లోనే కూర్చుంటారు. అలాంటిది వారికి కూడా టికెట్ తీసుకోవాలని చెప్పడంలో అర్థం లేదు'' అని బారెల్లీ హజ్ సేవాసమితి అధ్యక్షుడు, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అత్తా-ఉర్-రెహ్మాన్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కేంద్ర హజ్ కమిటీ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అరోపించారు. చిన్న పిల్లలకు టికెట్ తీసుకోవడం చాలా ముస్లిం కుటుంబాలకు కష్టంతో కూడుకున్నదని పేర్కొన్నారు. భారత్లోని మహిళలు తమ చిన్నారులను ఇక్కడే వదిలిపెట్టి హజ్ యాత్రకు వెళ్లలేరని అన్నారు.
హజ్ కమిటీ తాజా నిర్ణయంతో మహిళలు హజ్ యాత్రకు వెళ్లలేరని, ఈ విషయమై తాను త్వరలోనే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ను కలిస్తానని, దీనిపై జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతానన్నారు. బారెల్లీ హజ్ సేవా సమితీ ప్రకారం భారత్ నుంచి హజ్ యాత్రకు ఒక్కో వ్యక్తికి సుమారు రూ. 35 వేల వరకు ఖర్చు అవుతుందని వివరించారు.
తాగా నిర్ణయంతో చిన్న పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాల్సి వస్తే, అది మరింత భారంగా మారుతుందన్నారు.