CoWin: పోర్టల్లో మార్పులు: కోవిషీల్డ్ రెండో డోసు కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడటమే
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి టీకాల కొరత వెంటాడుతూనే వస్తోంది. దీనికి ఎప్పటికి బ్రేక్ పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్కు అనుగుణంగా వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోకుండానే కేంద్ర ప్రభుత్వం మూడో విడత టీకా కార్యక్రమానికి ఆదేశాలను జారీ చేయడం ఈ కొరతకు కారణమైందనే విమర్శలు వినిపిస్తోన్నాయి. వ్యాక్సిన్ కొరత ఉందనే విషయాన్ని కేంద్రం సైతం పరోక్షంగా అంగీకరించినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి కోవిన్ పోర్టల్లో తాజా మార్పులు చేసింది.
Recommended Video
తెలంగాణలో రెండో డోసు వ్యాక్సిన్కు సడన్ బ్రేక్: నిలిపివేసిన కేసీఆర్ సర్కార్: మళ్లీ ఎప్పటికో?
కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడానికి సుదీర్ఘ విరామం తప్పదని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. కోవిన్ పోర్టల్లో తాజాగా చేసిన మార్పుల ప్రకారం.. ఈ వ్యాక్సిన్ రెండో డోసు కోసం కనీసం 84 రోజుల పాటు విరామం తప్పదని తెలిపింది. ఇదివరకు 28 రోజుల పాటుగా ఉన్న ఈ కనీస ఇంటర్వెల్ గడువును 84 రోజులకు పెంచింది. కోవిషీల్డ్ తొలి, రెండో డోసు మధ్య 12 నుంచి 16 వారాల పాటు గ్యాప్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఈ పోర్టల్లో మార్పులు చేసింది. ఆన్ సైట్ లేదా ఆన్ సైట్ అపాయింట్మెంట్ మధ్య ఈ వ్యవధి తప్పకుండా అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది.
కోవిషీల్డ్ రెండో విడత వ్యాక్సిన్ కోసం ఇదివరకే ఆన్లైన్ ద్వారా బుకింగ్ స్లాట్ లభించిన వారు కూడా వేచి చూడక తప్పదని తెలిపింది. వారి స్లాట్ బుకింగ్ గడువు తీరిపోయినప్పటికీ.. అనుమతి ఇస్తామని, అవి రద్దు కాబోవని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కొరత ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం వల్ల కోట్లాదిమంది తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారు మరి కొన్ని రోజుల పాటు నిరీక్షించక తప్పకపోవచ్చు. డిమాండ్కు అనుగుణంగా వ్యాక్సిన్ సరఫరా అందకపోవడం వల్లే రెండో డోసు వ్యాక్సిన్ విరామాన్ని 84 రోజులకు పొడిగించింది కేంద్రం.