విదేశాల నుండి పార్సిల్స్ లో డ్రగ్స్: చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసుకు మూడు డ్రగ్స్ పార్సిల్స్ కలకలం
భారతదేశం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందన్న కొత్త భయం ఇప్పుడు దేశాన్ని వేధిస్తుంది. నిత్యం అనేకచోట్ల పట్టుబడుతున్న డ్రగ్స్ దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. చాప క్రింద నీరులా డ్రగ్స్ మాఫియా విస్తరించి కార్యాకలాపాలు సాగిస్తుంది. ఒకపక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం లోనూ డ్రగ్స్ కట్టడి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు అంటే దేశంలో పరిస్థితి ఇట్టే అర్ధం అవుతుంది.
విదేశాల నుండి పార్సిల్స్ ద్వారా డ్రగ్స్ .. చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసుకు మూడు పార్సిల్స్
డ్రగ్స్ దందా కొరియర్ ల ద్వారా కూడా యధేచ్చగా జరుగుతుండటం ప్రస్తుతం ఆందోళనకరంగా తయారైంది. దేశ వ్యాప్తంగా నిత్యం అనేక చోట్ల డ్రగ్స్ పట్టుబడుతుండడం సంచలనంగా మారుతుంది. ఇక ఏకంగా పార్సిల్స్ లో డ్రగ్స్ విదేశాల నుండి ఇండియాకు చేరుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది . చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసుకు ఈ డ్రగ్స్ చేరటం ఇప్పుడు కలకలంగా మారింది . చెన్నై ఎయిర్ కస్టమ్స్ ఇటీవల చెన్నై అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్లో మూడు పార్శిళ్ల ద్వారా రూ. 1.6 లక్షల విలువైన ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, సైకోట్రోపిక్ పదార్థాలు మరియు గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు డ్రగ్స్ స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను విఫలం చేశారు.
పార్సిల్స్ నెదర్లాండ్స్, అమెరికా నుండి వచ్చినట్టు గుర్తింపు
ఒక ప్రకటన ప్రకారం, ఒక పార్శిల్లో 26 ఎండీఎంఏ మాత్రలు మరియు మిగిలిన రెండింటిలో, 88 గ్రా నిషేధిత డ్రగ్స్ మరియు 105 గ్రా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి వచ్చిన మొదటి పార్శిల్ చెన్నైకి చెందిన వ్యక్తికి వచ్చింది. దానిని తెరిచి చూడగా, 14 గ్రాముల బరువున్న ఎండీఎంఏ కనుగొన్నారు. 26 ఆకుపచ్చ మాత్రలు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిని పరిశీలించగా ఎండీఎంఏ గా కనుగొనబడ్డాయి. రెండో కేసులో అమెరికా నుంచి వచ్చిన పార్శిల్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తికి వచ్చింది. పార్సిల్ ను పరిశీలించగా 24 గ్రాముల గంజాయి, 64 గ్రాముల ద్రవరూప గంజాయిని గుర్తించారు.
పార్సిల్స్ లో డ్రగ్స్ స్వాదీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
మూడో కేసులో అమెరికా నుంచి వచ్చిన పార్శిల్ హైదరాబాద్కు చెందిన వ్యక్తికి వచ్చింది. అందులో 105 గ్రాముల గంజాయిని తేమ అందించే పరికరంలో దాచి ఉంచారు. మొత్తంగా, 26 గ్రీన్ ట్యాబ్లెట్లు ఎండీఎంఏ (14 గ్రా), ద్రవ రూపంలో మార్చబడిన 64 గ్రా గంజాయి మరియు 129 గ్రాముల గంజాయి, మొత్తం రూ. 1.6 లక్షల విలువైన నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల (NDPS) నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులపై కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ పై దర్యాప్తు
కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మూడు పార్సిల్స్ లో డ్రగ్స్ దాచి, కేటుగాళ్లు పోస్టాఫీస్ ద్వారా చెన్నై చిరునామాకు పంపించారు. పార్సిల్ స్కానింగ్ లో డ్రగ్స్ సరఫరా తతంగం బయటపడడంతో పార్సిల్ పంపిన అమెరికా, నెదర్లాండ్స్ చిరునామా లపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పార్సిల్ పై ఉన్న అడ్రస్ లలో అధికారులు దాడులు చేశారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ వెనుక ఎవరు ఉన్నారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.