Pfizer: నాడు వద్దనుకున్న వ్యాక్సిన్ కోసం.. నేడు అమెరికా ప్రయాణం: త్వరలో కేంద్రమంత్రి టూర్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరత దేశాన్ని పట్టి పీడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని రెట్టింపు చేయడంపై దృష్టి పెట్టింది. విదేశాల నుంచి టీకాలను దిగుమతి చేసుకోవడానికీ ప్రాధాన్యత ఇస్తోంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ వద్ద అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులకు యుద్ధ ప్రాతిపదికన అనుమతులు దాఖలు చేయడంతో పాటు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ను వేగవంతం చేసేలా వసతులను కల్పిస్తోంది.
దండకారణ్యంలో కలకలం: 13 మంది మావోయిస్టుల మృతదేహాలు
ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అమెరికా అద్భుత ప్రగతిని సాధించిన విషయం తెలిసిందే. అమెరికాలో మిగులు వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున ఉంటోన్నాయి. వచ్చే వారం రోజుల్లో 80 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేస్తామంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన త్వరలోనే సంతకం చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 80 బిలియన్ డోసుల వ్యాక్సిన్లలో అధికవాటాను ఆశిస్తోంది.
ఇందులో భాగంగా- విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ త్వరలో అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం ఆయన యూఎస్కు వెళ్తారని సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విదేశాంగ మంత్రిత్వ శాఖ చేపట్టినట్లు చెబుతున్నారు. దీన్ని ఇంకా ఆ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సుబ్రహ్మణ్యం జైశంకర్ ఎప్పుడు బయలుదేరి వెళ్తారు? ఎన్ని రోజులక్కడ ఉంటారు?, ఎవరెవరితో సమావేశమౌతారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన అమెరికా పర్యటన మొత్తం వ్యాక్సిన్ల సేకరణ కోసమేనని అంటున్నారు.
ఫైజర్ వ్యాక్సిన్లను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమాచారం. దానితోపాటు కోవ్యాక్స్ను కూడా సమీకరించుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఫైజర్ వ్యాక్సిన్.. భారత్లో అత్యవసర వినియోగానికి డీసీజీఐ వద్ద దాఖలు చేసుకోగా.. అప్పట్లో దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని విషయం తెలిసిందే. అదనపు సమాచారం కావాలంటూ ఫైజర్ను ఆదేశించడంతో ఆ కంపెనీ ప్రతినిధులు తమ దరఖాస్తును వెనక్కి తీసుకున్నారు. ఇక అదే ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్ కోసం మళ్లీ కేంద్ర ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.