బీజేపీ నేత బబితా ఫోగట్ తోపాటు 63 మందిపై ఎఫ్ఐఆర్: కోవిడ్ నిబంధనల ఉల్లంఘించి ర్యాలీ
లక్నో: ఎన్నికల ర్యాలీ నిర్వహించి.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు రెజ్లర్ బబితా ఫోగట్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరో 63 మందిని కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సోమవారం బాగ్పత్లోని బరౌత్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ ఎస్ మాలిక్ తరపున ఫోగట్ ప్రచారం చేశారు.
దేశంలో కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా భౌతిక ర్యాలీలపై నిషేధాన్ని శనివారం జనవరి 31 వరకు ఈసీఐ పొడిగించింది. జనవరి 22, శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్లో, ఈసీఐ.. "జనవరి 31, 2022 వరకు రోడ్ షో, పాదయాత్ర, సైకిల్/బైక్/వాహన ర్యాలీ, ఊరేగింపు అనుమతించబడదు" అని పేర్కొంది.
అయితే, ఫేజ్ 1, 2 అభ్యర్థులను నిర్ణయించడానికి రాజకీయ పార్టీల బహిరంగ సమావేశాలు కొన్ని పరిమితులతో జనవరి 28 తర్వాత అనుమతించబడతాయి. దీంతో పాటు ఇంటింటికీ ప్రచారం చేసే వ్యక్తుల పరిమితిని కూడా ఐదు నుంచి పది మందికి పెంచారు.
అంతేగాకుండా, కోవిడ్-19 తగిన ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని, పబ్లిసిటీ కోసం వీడియో వ్యాన్లు కూడా కొన్ని పరిమితులతో అనుమతించబడతాయి.
ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఫిబ్రవరి 14న, మూడో దశ ఫిబ్రవరి 20న, నాలుగో దశ ఫిబ్రవరి 23న, ఐదో దశ ఫిబ్రవరి 27న.. ఆరో దశ మార్చి 3న జరగనుంది
ఏడో, చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుండగా, మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి రెండు దశల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను, స్టార్ క్యాంపెయినర్ జాబితాలను విడుదల చేశాయి. కరోనా నిబంధనలు అమల్లో ఉండటంతో తక్కువ సంఖ్యలో పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.