వచ్చే నెలలో పెళ్లి: సజీవ దహనమైన అక్కాతమ్ముడు
జైపూర్: రాజస్ధాన్లోని గుధమీనా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో గాఢ నిద్రిలో ఉన్న అక్కతో పాటు 13 ఏళ్ల తమ్ముడు సజీవ దహనమయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
లాల్ రామ్ మీనా, రాజంతి అనే దంపతులు తమ పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లాల్రామ్ పిల్లలు గయానా (18), యువరాజ్ (13) సజీవ దహనం అయ్యారని పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. పిల్లలను రక్షిద్దామని వెళ్లిన లాల్రామ్, రాజంతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఆరు మేకలు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని సమీపంలో ఉన్న ఆసుపత్రికి పిల్లలు గయానా, యువరాజ్లను తరలించారు. వారు మృతి చెందినట్లుగా వైద్యులు గుర్తించారు.
మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించి తల్లి దండ్రులకు అప్పజెప్పామన్నారు. అయితే అగ్రి ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. గయానా వివాహం వచ్చే నెలలో జరగాల్సి ఉందని పోలీసులు తెలిపారు.