భీకర కరోనా: అడ్డూ, అదుపు లేని వైరస్: భారత్లో ఒక్కరోజే వణుకు పుట్టించే రేంజ్లో పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: నాలుగు రోజులుగా భారత్ లాక్డౌన్లో ఉంటోంది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. జనం వీధుల్లోకి రావాలంటేనే భయపడుతున్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి కట్టుదిట్టమైన పరిస్థితుల్లో కూడా కరోనా మనదేశంలో విస్తరిస్తోంది.. రెక్కలు చాస్తోంది. ఒక్కరోజులోనే దిమ్మతిరిగే రేంజ్లో పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉలిక్కిపడేలా చేసింది.
వలంటీర్లపైనా పోలీసు జులుం: విధి నిర్వహణలో లాఠీ దెబ్బలు: రాత్రివేళ మెరుపు ధర్నా..!
ఒక్కరోజులో 88 పాజిటివ్ కేసులు..
గురువారం ఒక్కరోజే మనదేశంలో 88 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ మనదేశంలో ప్రవేశించినప్పటి నుంచీ ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా- లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా 88 పాజిటివ్ కేసులు నమోదు కావడం అంటే మాటలు కాదు. ఈ సంఖ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనల్లోకి నెట్టేసింది.
అత్యధికంగా మహారాష్ట్ర..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన జాబితాలో కేరళ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటిదాకా ఈ స్థానంలో మహారాష్ట్ర కొనసాగింది. కేరళలో ఒకేరోజు 19 కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 137కు చేరింది. మహారాష్ట్రలో 125 కేసులు ఇప్పటిదాకా రిజిస్టర్ అయ్యాయి. కర్ణాటక-55, తెలంగాణ-44, గుజరాత్-43,, ఉత్తర ప్రదేశ్-42, రాజస్థాన్-40, ఢిల్లీ-36, పంజాబ్-33, హర్యానా-32 కేసులు నమోదు అయ్యాయి.
16 మంది మృతి
ఇప్పటిదాకా మనదేశంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. గుజరాత్, మహారాష్ట్రల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్ణాటకలో ఇద్దరు మృతి చెందారు. ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, బిహార్లల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు. మహారాష్ట్ర, కేరళల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.