మహారాష్ట్రలో కరోనా కల్లోలం: 15వేల కొత్త కేసులు, దేశంలో సగానికిపైగా యాక్టివ్ కేసులు
ముంబై: మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కొత్త కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి రోజు 15వేల కంటే ఎక్కువే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 16,620 కొత్త కేసులు నమోదు కాగా, సోమవారం 15వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 15,051 కరోనా కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 23,29,464కి చేరింది. సోమవారం 48 మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 52,909కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 10,671 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 21,44,743కి చేరింది. ప్రస్తుతం 1,30,547 యాక్టివ్ కేసులున్నాయి. ముంబై నగరంలో 13,309, థానేలో 12,680, పుణెలో 26,468, నాగ్పూర్లో 18,114 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్ర నుంచే ఉండటం గమనార్హం. దేశ వ్యాప్తంగా 77శాతానికిపైగా యాక్టివ్ కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే ఉండగా, వాటిలో మహారాష్ట్రలోనే 58.15 శాతం యాక్టివ్ కేసులుండటం గమనార్హం. కేరళలో 13.58 శాతం, పంజాబ్ రాష్ట్రంలో 5.27శాతం, కర్ణాటకలో 3.82 శాతం, తమిళనాడులో 2.22 శాతం చొప్పున యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో మిగితా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 16.93 యాక్టివ్ కేసులున్నాయి.
కాగా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా యాక్టివ్ కేసులున్న 15 జిల్లాలను కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలో పుణె, నాగ్ పూర్, ముంబై, థానే, నాసిక్, కేరళలో ఎర్నాకుళం, పతనంమిట్ట, కన్నూర్, త్రిశ్శూర్, కోజికోడ్, పంజాబ్ రాష్ట్రంలో జలంధర్, ఎస్ఏఎస్ నగర్, ఎస్బీఎస్ నగర్, పటియాలా, హోషియార్పూర్లలో యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయి. ఇక దేశంలో ప్రస్తుతం 2,19,262 యాక్టివ్ కేసులున్నాయి. ఇది మొత్తం కేసుల్లో 1.93శాతంగా ఉంది.