మమతా బెనర్జీకి షాక్: గోవాలో ప్రభావం చూపలేకపోయిన దీదీ; ఆ ఆశలు అడియాశలు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి గోవా ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్న మమతాబెనర్జీకి ఎన్నికల ఫలితాలలో ఊహించని షాక్ తగిలింది. మమతా బెనర్జీ, ప్రశాంత్ కిషోర్ ఆలోచనలకు భిన్నంగా గోవాలో బీజేపీ దూకుడు చూపించింది. అధికారాన్ని హస్తగతం చేసుకునే పనిలో బీజేపీ ఉంది. ఇదిలా ఉంటే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ ఆశించిన ఫలితాలు వస్తే మిగతా రాష్ట్రాలలోనూ పార్టీని విస్తరించాలని భావించారు కానీ షాక్ ఇచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ డైలమాలో పడ్డారు.

గోవాలో మమతకు షాక్ ..
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గోవా అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గోవా ఎన్నికల ఫలితాలలో బీజేపీని చావు దెబ్బ కొట్టాలని ఆమె కంకణం కట్టుకున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాని అంచనాలు నిజమైతే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దానిని జాతీయ రాజకీయాల్లో లాంచింగ్ ప్యాడ్గా ఉపయోగించుకోవాలని భావించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పార్టీని విస్తృతం చేయడాన్ని వేగవంతం చేస్తూ, బిజెపికి వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రతిపక్షంగా ఎదగడానికి సన్నాహాలు చెయ్యాలని భావించిన ఆమెకు గోవా ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి.

గోవాలో టీఎంసీ అంచనాలు తలక్రిందులు
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న మమతాబెనర్జీ పార్టీ ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మమతా బెనర్జీ దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి గోవా ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. కానీ గోవాలో మమతకు ఊహించిన ఫలితాలు రాలేదు.

గోవా కేంద్రంగా మమత రాజకీయం.. పీఎం అభ్యర్థిగా జాతీయ రాజకీయాల ఆలోచన
మమతా బెనర్జీ గోవాలో తాము సీఎం అవ్వాలని అధికారం కోసం రాలేదని, కేవలం బీజేపీని ఓడించటానికి, గోవా అభివృద్ధి కోసం వచ్చామని పేర్కొన్నారు. అయినా గోవా ప్రజలు టీఎంసీని ఆదరించలేదు.
ఇసి వెబ్సైట్ ప్రకారం, టిఎంసి ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు.
మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి గోవా ఒక ప్రయోగాత్మక మైదానంగా పరిగణించబడుతుంది. ఆమె అడుగుపెట్టగలిగితే, పశ్చిమ బెంగాల్ వెలుపల ఆమెకు ఆమోదయోగ్యత ఉందని, అందువల్ల ప్రతిపక్ష పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థిగా తనను తాను సమర్ధించుకోవచ్చని ఆమె భావించారు.

గోవాలో టీఎంసీ ఫ్లాప్ షో
కానీ పశ్చిమ బెంగాల్లో అధికార పార్టీ అయిన టిఎంసి గోవాలో మాత్రం ప్లాప్ షో కనబరిచింది. గోవాలో 25 సీట్లలో ఎంజీపీ తో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన మమతా బెనర్జీ ఇప్పటివరకు విలువైన ఫలితాలను రెండు మూడు స్థానాల్లో తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 5.22 శాతం ఓట్లను సాధించింది. తృణముల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీకి 7.65 శాతం ఓట్లు వచ్చాయి.

గోవా టీఎంసి ముఖ్య నేతలకు ఎన్నికల్లో ఘోర పరాభవం
టీఎంసీ పార్టీ సభ్యురాలు కఠినమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, గోవాలో టిఎంసి అవమానకరమైన మరియు ఘోరమైన ఓటమిని చవిచూసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. గోవాలో టీఎంసీ ముఖ్య నేతలు గోవా పార్టీ చీఫ్ కిరణ్ కండోల్కర్, ఆయన భార్య కవిత, పార్టీ నామినీ చర్చిల్, ఆయన కూతురు వలంక.. అందరూ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. గోవా ప్రజల మనసు గెలుచుకోవడానికి మేము ఇంకా కష్టపడాలి అని తెలిసింది. ఎంత సమయం పట్టినా మేము ఇక్కడే ఉంటాం.. ఎన్నేళ్లు అయినా సరే.. గోవా ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటాం.. అని టీఎంసీ గోవా కార్యాలయం ప్రకటించింది.

జాతీయ రాజకీయాల విషయంలో పునరాలోచనలో దీదీ
ఉత్తరప్రదేశ్లో, యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తున్నారు. యుపిలో టిఎంసి ఒక్క సీటులో కూడా పోటీ చేయకపోగా, ఆమె ప్రచారం నిర్వహించిన ఎస్పీ ఓటమి పాలయ్యింది. దీంతో మమతా బెనర్జీ ప్రచారం ఫలించలేదు.
మమతా బెనర్జీ తనను తాను జాతీయ రాజకీయాల్లోకి మాత్రమే కాకుండా, గోవా మరియు ఉత్తరప్రదేశ్లలోని ఈ ఎన్నికలను ఉపయోగించి ప్రధాని మోడీకి పోటీదారుగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు ఆమె ప్రయత్నం విఫలం అయినట్టు చూపించాయి. దీంతో మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై పునరాలోచనలో పడ్డారని సమాచారం.












Click it and Unblock the Notifications