మరీ రెండు సీట్లేనా? ఆప్-కాంగ్రెస్ మధ్య కుదరని సీట్ల బేరం: పొత్తు లేదంటూ తేల్చేసిన షీలా
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. ఆప్ తో పొత్తు ఉండబోదంటూ తేల్చేసింది. పొత్తులో భాగంగా.. తమకు మూడు లోక్ సభ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా.. రెండు కంటే ఎక్కువ ఇవ్వలేమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. చివరి వరకూ కొనసాగిన బేరసారాలు ఫలప్రదం కాలేదు. ఆప్ తో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఒంటరిగా బరిలో దిగుతామని మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ తేల్చి చెప్పారు. ఇది తాము తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు.
మూడు సీట్లు కావాలంటూ కాంగ్రెస్ పట్టు..
ఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఈ ఏడు స్థానాల్లో మూడింటిని తమకు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దీన్ని దృష్టలో పెట్టుకుని ఉమ్మడిగా పోటీ చేస్తే, ఢిల్లీలో బీజేపీకి ఒక్క లోక్ సభ స్థానం కూడా దక్కదని షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతిపాదించారు. దీనికి సరేనన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఏడు స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ కు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.
దీనిపై పార్టీ అధిష్ఠానంతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ కాంగ్రెస్ వెల్లడించింది. మంగళవారం న్యూఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో షీలా దీక్షిత్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్లు భేటీ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముందు ఉంచిన ప్రతిపాదనలపై చర్చించారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నందున ఒంటరిగా పోటీ చేయడమే మేలంటూ కొంతమంది సూచించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వెలువడ్డాయి.
ఒంటరిపోరే సుఖమన్న సీనియర్లు
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలు జట్టుకట్టిన నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే మేలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీన్ని ఆధారంగా చేసుకుని.. తమకు మూడు లోక్ సభ స్థానానలు కేటాయించాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. పైగా- కోరుకున్న సీట్లనే ఇవ్వాలని కూడా డిమాండ్ పెట్టింది. దీనికి ఆప్ అంగీకరించలేదు. రెండు స్థానాలకు మించి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. చివరి వరకూ రెండు పార్టీల నేతలు మెట్టు దిగలేదు. దీనితో పొత్త వ్యవహారం బెడిసి కొట్టింది. ఆప్ తో పొత్తు ఉండదని, ఒంటరిగా పోటీ చేస్తామని షీలా దీక్షిత్ ప్రకటించారు.
ఢిల్లీ పరిధిలో ఉన్న ఏడు లోక్ సభ స్థానాలకు ఆప్ ఇదివరకే తమ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ వెస్ట్ స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. పొత్తు లేకపోవడం వల్ల త్వరలోనే ఈ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటిస్తామని ఆప్ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఏడు లోక్ సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొందరు సీనియర్ నాయకులను బరిలో దింపవచ్చని తెలుస్తోంది.