ఆ నినాదం.. మోడీ మౌనాన్ని బద్దలుకొట్టింది?: ఇదీ ఆంతర్యం.. అందుకే స్పందించారా!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో గోసంరక్షకుల పేరిట దళితులు, ముస్లింలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ఇక దీనిపై స్పందించడం మోడీకి అనివార్యం అయిందనే చెప్పాలి.
న్యూఢిల్లీ: దేశంలో 'బీఫ్' చుట్టూ ముసురుకున్న వివాదం.. ముస్లింలు, దళితుల హననానికి దారితీస్తున్న అమానవీయ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆహారపు అలవాట్లను నియంత్రించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తున్న చోట.. గోరక్షకుల 'బీఫ్' దాడులు పెరిగిపోవడం రెండింటి మధ్య పరోక్ష సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.
హర్యానాలో జునైద్ హత్య: స్పందించిన సబా దివాన్, హోరెత్తిన నిరసన
అందుకే అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇప్పటివరకు గోరక్షకుల దాడులపై నోరు మెదిపినా దాఖలా లేదు. కానీ ఇన్నాళ్ల ఆయన మౌనాన్ని ఒక్క నినాదం బద్దలుకొట్టింది. గిరీశ్ కర్నాడ్ లాంటి ప్రఖ్యాత నాటక ప్రయోక్తలు సైతం 'నాట్ ఇన్ మై నేమ్' అంటూ నిరసనతో రోడ్డెక్కిన వేళ.. ప్రధాని మోడీ దీనిపై స్పందించక తప్పలేదు.
ఇదేనా వాళ్లకు దక్కిన ప్రతిఫలం?:
ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముస్లింలు సైతం తమవైపే నిలిచారని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇందుకు ప్రతిఫలంగా ముస్లింలకు గోరక్షకుల దాడులే దక్కాయన్న వాదన ఉంది. గోరక్షకుల దాడులు మితిమీరిపోవడం.. ఎప్పుడూ ఎవరో ఒకరిపై తెగబడుతుండటంతో.. దీని ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ఉన్న దళితులు, ముస్లింలపై తీవ్ర ప్రభావాన్ని చూపించేదిగా మారింది.
విద్యార్థులు, మేదావులు, పలువురు సుప్రసిద్ద వ్యక్తులు.. దీనిపై నిరసన వ్యక్తం చేస్తుండటంతో.. ఇక దీనిపై మౌనం వహించడం తమకు లేని ప్రతికూలతలను కల్పిస్తుందని మోడీ భావించినట్లున్నారు. అందుకే ఇన్నాళ్ల ఆయన మౌనం బద్దలైంది.
ఓటు బ్యాంకు కోసమేనా?:
'నాట్ ఇన్ మై నేమ్' పేరిట ఒక ఉధృతమైన నిరసన జరుగుతుంటే.. దాన్ని చూసీ చూడనట్లు వదిలేయడం.. పార్టీకే నష్టం చేకూరుస్తుందని మోడీ భావించినట్లున్నారు. పైగా దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటినుంచే గోరక్షకులను నియంత్రించడమో.. లేక కనీసం దళితులు, ముస్లింలకు సహానుభూతి తెలియజేయాలన్న ఉద్దేశంతోనో ప్రకటనలు చేయకుంటే.. వారి ఓటు బ్యాంకు పార్టీకి దూరమవతుందనే ఆందోళన ఆయనలో మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గోరక్షకులకు వ్యతిరేకంగా మోడీ గొంతెత్తారన్న వాదన వినిపిస్తోంది.
గతంలో ఇలా లేదు?:
గతంలో గోవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. వాటిని సంరక్షించుకోవాలని, పూజించాలని, పశుశాలలు కట్టించాలని మాట్లాడారే తప్పితే.. గోరక్షకుల దాడులపై స్పందించలేదు. అలాంటిది అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమంలో ఒక్కసారిగా గో సంరక్షకులు, గో సంరక్షణ సమితులు చేస్తున్న దాష్టీకాలపై ఆయన విరుచుకుపడటం కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఉన్నపలంగా ఆయన వారికి వ్యతిరేకంగా మారారేంటి? అన్న అనుమానం కలగవచ్చు. అయితే ఇదంతా గోరాజకీయంలో భాగమే అనేవారు లేకపోలేదు.
జునైద్ హత్యతో ఉధృత నిరసన:
ఢిల్లీలో అఖ్లాక్ హత్య దేశాన్ని ఎంతలా కుదిపేసిందో.. ఇప్పుడు జువేద్ హత్య కూడా అంతలా కుదిపేస్తోంది. 'నాట్ ఇన్ మై నేమ్' అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం నుంచి.. ప్రజలంతా రోడ్ల పైకి రావడంతో.. దీని తీవ్రత ఏంటో ప్రభుత్వానికి తెలిసి వచ్చింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో గోసంరక్షకుల పేరిట దళితులు, ముస్లింలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ఇక దీనిపై స్పందించడం మోడీకి అనివార్యం అయిందనే చెప్పాలి. ఆవు మాంసం తిన్నారన్న కారణంగా ఢిల్లీ రైల్లో జునైద్ అనే యువకుడిని గోరక్షకులు హత్య చేయడంతో పరిస్థితులు మరింత వ్యతిరేకంగా మారాయి. దీంతో 'నాట్ ఇన్ మై నేమ్' అనే నినాదం మోడీని ఎట్టకేలకు నోరు తెరిచేలా చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.