భారత్ ఆటలు సాగవు.. అజిత్ దోవల్ వ్యూహాలు ఫలించవు: పాకిస్తాన్
పాకిస్తాన్ మరోసారి భారత్ పై విరుచుకుపడింది. శుక్రవారం ఐక్యరాజ్య సమితి (ఐరాస) సాధారణ సభలో సమాధానం చెప్పే హక్కును వినియోగించుకుంటూ ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ శాశ్వత మిషన్ కౌన్సిలర్ టిప్పు ఉస్మాన్ భా
జెనీవా : భారతదేశం ఆటలు సాగవని, భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అనుసరిస్తున్న వ్యూహాలు విజయవంతం కాబోవని పాకిస్తాన్ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సాధారణ సభలో సమాధానం చెప్పే హక్కును వినియోగించుకుంటూ భారత్పై పాక్ విరుచుకుపడింది.
ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ శాశ్వత మిషన్ కౌన్సిలర్ టిప్పు ఉస్మాన్ ఐరాస సాధారణ సభలో మాట్లాడుతూ దూకుడుతనం నిండిన రక్షణ విధానం, అడకత్తెరలో పోక చెక్కలా నొక్కిపెట్టే వ్యూహాలను భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అనుసరిస్తున్నారని, ఆ వ్యూహాలు విజయవంతం కాబోవని చెప్పారు.
ఈ వ్యూహాలతో ప్రాంతీయ ఆధిపత్యాన్ని సాధించాలని భారత్ భావిస్తోందన్నారు. కమాండర్ జాదవ్ వంటి ఇండియన్ టెర్రర్ ఆపరేటర్లు పాకిస్థాన్లో గూఢచర్యం చేస్తూ పట్టుబడుతున్నారని, వీరు భారతీయుల కలలను నెరవేర్చలేరని టిప్పు ఉస్మాన్ వ్యాఖ్యానించారు.
భారతదేశ భద్రతా దళాల చేతుల్లో కశ్మీరీలు అనుభవిస్తున్న దుస్థితిని అంతర్జాతీయ సమాజం, హక్కుల సంస్థలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీలు అంతర్జాతీయ సమాజం వైపు, మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వైపు చూస్తున్నారని టిప్పు అన్నారు. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం కోసం చూస్తున్నారన్నారు.
ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత, న్యాయమైన, నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చిన హామీ నెరవేరాలని కశ్మీరీలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. భారతదేశం సృష్టించాలనుకుంటున్న అపోహలను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతల అణచివేతకు భారతదేశమే బాధ్యత వహించాలన్నారు.