పటేల్ ఆందోళన: చెలరేగిన అల్లర్లు, 6గురు మృతి
అహ్మదాబాద్: పటేళ్లను ఒబిసిలో చేర్చాలని సాగుతున్న ఆందోళన బుధవారంనాడు హింసాత్మకంగా మారింది. గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఆరుగురు మరణించారు. తమ డిమాండ్ సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ప్రకటించిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి.
అల్లర్లు పెరగవచ్చుననే అనుమానంతో అహ్మదాబాదులోని కొన్ని ప్రాంతాల్లో, ఇతర ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అహ్మదాబాద్లోనే కాకుండా సూరత్, మేహ్సేన, రాజ్కోట్, జామ్నగర్, పటాన్ నగరాల్లో బుధవారం కర్ఫ్యూ విధించారు.
బుధవారం హార్దిక్ పటేల్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ సందర్భంగా హింస చెలరేగింది. సైన్యాన్ని రంగంలోకి దించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ జన్మభూమిలో హింసను సాధనంగా వాడుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
సుమారు 5 వేల మంది పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్తో మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
హింసకు హార్దిక్ పటేల్ పోలీసులను నిందించారు. పోలీసులు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అల్లర్లలో మరణించారని భావిస్తున్న ముగ్గురి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వస్త్రాల్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారని పోలీసు అధికార ప్రతినిధి ఎన్డీ తివారీ చెప్పారు. పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.