అమెరికా విమానం ఎక్కిన ప్రధాని మోడీ: విశేషాలను వెల్లడించి మరీ..!
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఆరంభమైంది. మూడు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. వేర్వేరు సమావేశాల్లో పాల్గొంటారు. 2019 తరువాత నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. 2019 సెప్టెంబర్లో ఆయన అమెరికా వెళ్లారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ట్రంప్తో కలిసి హౌడీ మోడీ ఈవెంట్లోనూ పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ అమెరికా విమానం ఎక్కడం ఇదే తొలిసారి.
కుప్పంపై టీడీపీ స్కానింగ్: చంద్రబాబు కొత్త సీటు వెదుక్కోక తప్పదా?: వైసీపీ కాన్ఫిడెంట్కు కారణాలివే
ఇప్పటిదాకా వర్చువల్గా
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలను స్వీకరించిన తరువాత- నరేంద్ర మోడీ ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఇప్పటిదాకా వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కలుసుకున్నప్పటికీ.. ఇన్-పర్సన్ భేటీ కావడం ఇదే మొదటిసారి అవుతుంది. మార్చిలో క్వాడ్ మీటింగ్, ఏప్రిల్లో వాతావరణ మార్పులు, జూన్లో జీ-7 సదస్సులో వర్చువల్ విధానంలోనే కొనసాగాయి. కాగా ఈ దఫా క్వాడ్ మీటింగ్ ముఖాముఖిగా ఆరంభం కానుంది.
బంగ్లాదేశ్ తరువాత..
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదిన్నర కాలంగా ఆయన ఏ దేశ పర్యటనకు కూడా వెళ్లలేదు.. ఒక్క బంగ్లాదేశ్ తప్ప. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగమనే విమర్శలను ఎదుర్కొన్నారు అప్పట్లో. ఆ తరువాత మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లడం ఇదే మొదటిసారి.
మూడు రోజుల పర్యటన వివరాల వెల్లడి
ఫ్లైట్ ఎక్కడానికి ముందే ఆయన తన మూడురోజుల అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అగ్రరాజ్యం అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆసియా-పసిఫిక్ రీజియన్లో నెలకొన్న తాజా పరిణామాలు, ఇతర ప్రపంచ స్థాయి అంశాల గురించి చర్చిస్తానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ను కలుసుకుంటానని పేర్కొన్నారు.
ఆ ముగ్గురితో..
జో బైడెన్తో పాటు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగలతో కలిసి ఫస్ట్ ఇన్పర్సన్ క్వాడ్ మీటింగ్కు హాజరవుతానని మోడీ తెలిపారు. ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో నెలకొన్న అంశాలు, సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి అవసరమైన చర్యలు, అమలు చేయదలిచిన వ్యూహాలను రూపొందించుకోవడానికి ఈ క్వాడ్ సమ్మిట్ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
ప్రాధాన్యతా అంశాలివే..
అమెరికా సహా జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి కీలకమైన ప్రపంచస్థాయి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. వాతావరణ మార్పులు, భూతాపాన్ని తగ్గించడం, కర్బన ఉద్గారాల వినియోగాన్ని నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి క్వాడ్ సమ్మిట్లో చర్చిస్తామని అన్నారు. అన్ని దేశాలకు ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం గురించి ప్రస్తావిస్తానని మోడీ చెప్పారు.
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో
క్వాడ్ మీటింగ్ ముగిసిన మరుసటి రోజే- ప్రధాని మోడీ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్ నిర్మూలన, వ్యాక్సినేషన్, భారత్కు చెందిన కొన్ని ఫార్మాసూటికల్స్ కంపెనీలు వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలపై ప్రధాని ప్రసంగిస్తారు. దీనితో ఆప్ఘనిస్తాన్ పరిణామాలు, తాలిబన్లకు పాకిస్తాన్ సహాయం చేస్తోందనే విషయాన్ని సైతం మోడీ లేవనెత్తే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.