కష్టకాలంలో కేరళకు మరోసారి రియలన్స్ ఫౌండేషన్ భారీ సాయం: ఫ్రీగా 2.5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు
ముంబై/తిరువనంతపురం: కష్ట కాలంలో కేరళ రాష్ట్రానికి మరోసారి సాయం అందించింది రిలయన్స్ ఫౌండేషన్. కరోనావైరస్ కేసుల వ్యాప్తితో సతమతమవుతున్న కేరళకు గురువారం 2.5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందజేసింది. దీనిపై ముఖ్యమంత్రి విజయన్ స్పందించారు.
రిలయన్స్ ఫౌండేషన్ సహకారం తమ వ్యాక్సినేషన్ డ్రైవ్ను మరింత ముమ్మరం చేస్తుందని సీఎం తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు విజయన్. కాగా, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ మేరకు సహాయాన్ని సీఎంకు అందించారు.
కరోనావైరస్ మహమ్మారి కట్టడి విషయంలో దేశానికి వెన్నంటే ఉన్నామని, వైరస్ నియంత్రణ విషయంలో మాస్ వ్యాక్సినేషన్ విధానం ఎంతో ప్రభావంతమైందని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ వ్యాఖ్యానించారు. మిషన్ వ్యాక్సిన్ సురక్షలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉచితంగా టీకా పంపిణీ చేపడుతున్నామని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే కేరళ ప్రజలకు అండగా నిలిచామని నీతా అంబానీ పేర్కొన్నారు.
'వీలైనంత త్వరగా భారతీయులందరికీ వ్యాక్సిన్ అందాలన్నదే మా ఆకాంక్ష. అందుకోసం ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. అందరం ఐక్యంగా ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొని ఎదుగుదాం. మళ్లీ మంచి రోజులు త్వరలోనే వస్తాయి' అని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్ పర్సన్ నీతా ఎం.అంబానీ ఆకాంక్షించారు.
కాగా, గతంలో కేరళలో భారీగా వరదలు సంభవించినప్పుడు కూడా రిలయన్స్ ఫౌండేషన్ సాయం చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ కేరళ సీఎం సహాయనిధికి రూ. 21 కోట్లు విరాళంగా ఇచ్చింది. వరద సహాయక చర్యలు చేపట్టడంతోపాటు మందులు, నిత్యావసరాలను ప్రజలకు అందించింది.
అంతేగాక, దేశ వ్యాప్తంగా రిలయన్స్ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. కాగా, రిలయన్స్ ఫౌండేషన్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సంయుక్తంగా ముంబైలోని 50 మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు ఉచితంగా దాదాపు 3లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించనున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్ ఫౌండేషన్ ఇటీవల ప్రకటించింది.
సర్ హెచ్ఎన్ .రిలయన్స్ ఫౌండేషన్ ఆాస్పత్రి(హెచ్ఎన్ఆర్ఎఫ్హెచ్) ద్వారా మూడు నెలల పాటు ప్రత్యేకమైన వ్యాక్సిన్ డ్రైవ్ను నిర్వహించనుంది. నగరంలోని ధారావి, వోర్లీ, కొలాబా, వాడాలా, ప్రతీక్షానగర్, కమాటిపురా, మన్ఖుర్డ్, చెంబూర్, గొవాండీ, బండప్ లాంటి మురికి వాడలకు చెందిన వారి కోసం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం హెచ్ఎన్ఆర్ఎఫ్హెచ్... స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వాహనాలను వినియోగించుకోనుంది. బీఎంసీ, బెస్ట్.. వ్యాక్సినేషన్ కోసం మౌళిక సదుపాయాలు, రవాణాలో సాయం చేయనున్నాయి.
గత 16 నెలలుగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరాను ఉచితంగా చేసింది. అలాగే దాదాపు కోటి మాస్కులు, ఏడున్నర కోట్ల భోజనాలు, కొవిడ్ రోగుల చికిత్స కోసం 2వేలకు పైగా బెడ్స్ పంపిణీ చేసింది. కరోనా నియంత్రణ కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేశమంతా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది.
మిషన్ వ్యాక్సిన్ సురక్ష (ఎంవీఎస్) కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ గ్రూప్స్లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడినవారి కోసం రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటికే దాదాపు 10లక్షల వ్యాక్సిన్ డోసులను కేటాయించింది. రిలయన్స్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇప్పటికే దాదాపు 98 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం విశేషం.