మహారాష్ట్ర సంక్షోభం సుప్రీంకోర్టుకు: గోవాకు షిండే వర్గం: ఆ లేఖతో శరవేగంగా పరిణామాలు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం బల పరీక్షలను ఎదుర్కొనబోతోంది. తన బలాన్ని నిరూపించుకోవడానికి సమాయాత్తమౌతోంది. దీనికి ముహూర్తం కూడా కుదిరింది. బల నిరూపణ కోసం ప్రత్యేకంగా సభను సమావేశ పర్చాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. అసెంబ్లీ కార్యదర్శికి కొద్దిసేపటి కిందటే లేఖ రాశారు.
11 గంటలకు..
దీని కోసం గురువారం ఉదయం 11 గంటలకు సభ సమావేశ పర్చాలని ఆదేశించారు. సాయంత్రం 5 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ సభ ముగియాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి అసెంబ్లీ భవన సముదాయం వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయాలని సూచించారు. బల పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లనూ సత్వరమే పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు.
సుప్రీంలో పిటీషన్..
గవర్నర్ రాసిన ఈ లేఖలో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీలూ అప్రమత్తం అయ్యాయి. సమావేశాలకు పిలుపునిచ్చాయి. ఈ లేఖకు వ్యతిరేకంగా శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొద్దిసేపటి కందటే పిటీషన్ను దాఖలు చేశారు. శివసేన ఉద్ధవ్ వర్గం తరఫున ఈ పిటీషన్పై సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించనున్నారు.
ఈ సాయంత్రమే హియరింగ్..
ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్పై విచారణ చేపట్టనుంది. గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బల నిరూపణ ఏర్పాటయిన నేపథ్యంలో ఇవ్వాళే పిటీషన్ను విచారించాలంటూ మను సింఘ్వీ బెంచ్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై బెంచ్ సానుకూలంగా స్పందించింది. ఈ సాయంత్రం 5 గంటలకు వాదనలను వింటామని పేర్కొంది.
ఎమ్మెల్యేలో భేటీలు..
కాగా- బల నిరూపణ నేపథ్యంలో అన్ని పార్టీలు.. తమ తమ శాసన సభ్యులతో సమావేశమౌతున్నాయి. మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో భాగస్వామ్యమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేతో సమావేశమైంది కూడా. ముంబైలో శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. ఎన్సీపీ నేతలు, హోం మంత్రి దిలీప్ వల్సే పాటిల్, జయంత్ పాటిల్ సహా పలువురు నాయకులు శరద్ పవార్ నివాసానికి చేరుకున్నారు.
బీజేపీ సభ్యులకు..
మరోవంక- బీజేపీ శాసన సభ్యులు ఈ మధ్యాహ్నం సమావేశం కానున్నారు. ముంబై కొలాబాలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్కు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలందరికీ సమావేశం అందింది. వారంతా ముంబైకి చేరుకుంటోన్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ షెడ్యూల్ అయింది. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్.. ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. బల నిరూపణ నేపథ్యంలో వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
గోవాకు తిరుగుబాటు నేతలు..
కాగా- గురువారం బలనిరూపణ నేపథ్యంలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ గువాహటి నుంచి గోవాకు చేరుకోనున్నారు. స్పైస్జెట్ విమానంలో వారు టికెట్లను బుక్ చేసుకున్నారు. అదే సమయంలో గోవాలోని తాజ్ కన్వెన్షన్ హోటల్లో మొత్తం 71 గదులను తిరుగుబాటు ఎమ్మల్యేలు బుక్ చేశారు. ఇవ్వాళ అంతా వారు గోవాలనే ఉండనున్నారు. సరిగ్గా బల నిరూపణ సమయానికి గోవా నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకుంటారు.
బీజేపీలో హర్షాతిరేకాలు..
ఈ పరిణామాలు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీలో జోష్ నింపాయి. ఏక్నాథ్ షిండే వర్గం వైపు శివసేనకు చెందిన మెజారిటీ సభ్యులు ఉండటం వల్ల ఇప్పటికే మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ తిరుగుబాటు వర్గం ఎవరికి మద్దతు ఇస్తే- ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఏక్నాథ్ షిండే.. హిందుత్వవాదంతో తిరుగుబాటు లేవదీసిన నేపథ్యంలో.. ఆయన తన తిరుగుబాటు నాయకులతో కలిసి బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.