రిక్షా వర్కర్ల నుంచి టెక్కీ వరకు: జయ గెలుపు వెనుక..
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కరుణానిధి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పాయి. అయితే, ఫలితాలు చూస్తే రివర్స్ అయ్యాయి.
జయలలిత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, డీఎంకేతో పొత్తుకు విజయకాంత్ (డీఎండీకే అధినేత) ముందుకు రాకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల కరుణానిధి దెబ్బతిన్నారని చెప్పవచ్చు. అలాగే, అందరూ ఊహించినట్లుగా దక్షిణ తమిళనాడులో పట్టు ఉన్న అళగిరి మద్దతు పలకకపోవడం కూడా డీఎంకేను నష్టపరిచిందంటున్నారు.
అళగిరికి ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. కానీ ఆయన ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. ఈ ఎఫెక్ట్ కరుణానిధి పార్టీ పైన పడింది. అలాగే, డీఎండీకే, డీఎంకేలు కలిసి పోటీ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. అన్నింటికి మించి అమ్మ ప్రవేశ పెట్టిన పథకాలు బాగా పనికి వచ్చాయని చెబుతున్నారు.
దీంతో, డిఎంకే - కాంగ్రెస్, బీజెపీ, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే పార్టీలు మరోసారి అమ్మ ముందు తలవంచక తప్పలేదు.
తమిళనాడులో ఓసారి అధికారంలో ఉన్న పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చే సంప్రదాయం లేదు. ఈసారి ఓటర్లు మాత్రం భిన్నంగా తీర్పు ఇచ్చారు.
తమిళనాడులో ఎన్నికలు జరిగిన 232 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితాల సరళి వెలువడుతుండగా.. జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 134 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే - కాంగ్రెస్ సెంచరీకి చేరువలో ఉంది. దీంతో ప్రభుత్వాన్ని జయలలిత ఏర్పాటు చేసేలా ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఇక, మూడు రోజుల క్రితం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థ జయలలితకు ఓటమి తప్పదని, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి రానుందని వెల్లడైంది. తీరా ఇప్పుడు ఫలితం తారుమారవుతోంది.
తమిళనాడులో జయలలిత పేదల కోసం ప్రారంభించిన పలు పథకాలు చూపిన ప్రభావాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు విఫలమైనాయని చెప్పుకోవచ్చు. నిత్యం అమ్మ క్యాంటీన్లలో రూ.3 చెల్లించి సాంబార్ అన్నం, రూ.1 చెల్లించి ఇడ్లీలు తింటున్న రిక్షా కార్మికుల నుంచి ఐటీ ఉద్యోగుల వరకూ వేసిన ఓట్లు ఈ ఎన్నికల్లో జయలలితకు ఎంతో ప్లస్ అయ్యాయి.
నిత్యం వేలాది మంది అమ్మ క్యాంటీన్లలోని భోజనం తింటున్నారు. వీరంతా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాంబార్ రైస్, ఇడ్లీలు మాత్రమే కాదు, రూ.5కే పాలక్ రైస్, కర్డ్ రైస్ వంటి ఆహార పదార్థాలను సైతం అమ్మ క్యాంటీన్లు అందిస్తున్నాయి. వీటితో పాటు అమ్మ ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ఉన్నాయి.