బహిరంగ ప్రదేశాల్లోనే కాదు... ఇంట్లోనూ మాస్క్ ధరించాల్సిందే... కేంద్ర ప్రభుత్వం కీలక సూచన...
కరోనా పేరు వింటే చాలు జనం వణికిపోతున్న పరిస్థితి. గతేడాది మొదటి వేవ్ కంటే ఇప్పుడు రెండో వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఎవరి నుంచి ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. కేవలం స్వీయ రక్షణ మాత్రమే ఇప్పుడు కరోనా నుంచి కాపాడగలదు. కాబట్టి అనవసర ప్రయాణాలు మానుకోవడం,ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే... మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అయితే బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు... ఇంట్లోనూ మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది.
Recommended Video
ఇంట్లోనూ మాస్క్పై నీతి ఆయోగ్..
నీతి ఆయోగ్(హెల్త్) సభ్యుడు డా.వీకె పాల్ మాట్లాడుతూ... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లోనూ మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఇంటికి ఎవరిని ఆహ్వానించవద్దన్నారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టవదన్నారు. 'ఒకవేళ ఇంట్లో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయితే... ఇతర కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లోనూ మాస్క్ ధరించాలి.' అని పేర్కొన్నారు.
మాస్క్ ధరిస్తే 90శాతం రిస్క్ తగ్గినట్లే...
'ఇప్పటివరకూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వైరస్ వ్యాప్తి రీత్యా ఇంట్లోనూ తప్పక మాస్కు ధరించాలి. కరోనా సోకిన వ్యక్తితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో మాస్కులు ధరించాల్సిందే. కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో ప్రత్యేక గదిలో ఐసోలేషన్లో ఉండాలి. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే మెడికల్ రిపోర్ట్ వచ్చేవరకు ఎదురుచూడవద్దు. వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లాలి. ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించకపోవడం,భౌతిక దూరం పాటించకపోవడం వల్ల 90శాతం వైరస్ సంక్రమణకు అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా సోకని వ్యక్తి మాస్కు ధరించడం ద్వారా వైరస్ సోకే రిస్క్ 30శాతం తక్కువగా ఉంటుంది.' అని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ పేర్కొన్నారు.
30 రోజుల్లో 406 మందికి...
భౌతిక దూరం పాటించకపోవడం వల్ల వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి 30 రోజుల వ్యవధిలో 406 మందికి అది సంక్రమించే అవకాశం ఉందని అగర్వాల్ తెలిపారు. భౌతిక దూరం పాటించడం ద్వారా అది కేవలం 2.5 మంది వ్యక్తులకే పరిమితం అవుతుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ప్రతీరోజూ దాదాపు 3 లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మే మధ్య వారం నాటికి దేశంలో కరోనా కేసులు పీక్స్కి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 30 నాటికి ఉత్తరప్రదేశ్లో రోజుకు 1.19లక్షల కరోనా కేసులు,మహారాష్ట్రలో 99వేల కరోనా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇంత హృదయవిదారకంగా ఉంటే... ఇక పీక్స్కి చేరుకున్న దశలో ఇంకెంత విషాదాన్ని చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది.