పంచాయితీ పెద్దల తీర్పుతో మహిళ ఆత్మహత్య
భోపాల్: అక్రమ సంబంధం అంటగట్టారని మనోవేదనకు గురైన వివాహిత ఆత్మహత్య చేసుకునింది. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లోని టికామ్ గడ్ జిల్లాలో జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
టికామ్ గడ్ జిల్లాలోని బజూరువా ఖారీ గ్రామంలో (36) ఏళ్ల వివాహిత భర్త రాకేష్, నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. మూడు రోజుల కిందట రాకేష్ స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు. ఆ సందర్బంలో రాకేష్ స్నేహితుడైన దళితుడితో అతని భార్య సన్నిహితంగా ఉందని కుల పెద్దలు ఆరోపించారు.
ఇదే విషయంపై పంచాయితీ జరిగింది. పంచాయితీ పెద్దలు ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారు. వివాహిత దళితుడితో సన్నిహితంగా ఉందని, ఆ దళితుడు రాకేష్ తో కలిసి పని చేస్తున్నాడని కొందరు సాక్షం చెప్పాడంతో పంచాయితీ పెద్దలు ఈ విధంగా తీర్మానించారు. వివాహితకు రూ. ఐదు వేలు జరిమానా కట్టాలని తీర్పు చెప్పారు.
దళితుడితో సంబంధం పెట్టుకున్నారని ఆ మహిళను మందలించారు. ఆమెను గంగా నదిలో స్నానం చెయ్యాలని, 30 మందికి మందు పార్టీ ఇవ్వాలని, గ్రామంలో ఉండే శివాలయం వరకు పోర్లుదండాలు పెడితే ఆమె చేసిన తప్పును క్షమిస్తామని పంచాయితీ పెద్దలు తీర్పు చెప్పారు. ఈ విషయంపై విరక్తి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, పంచాయితీ పెద్దలను విచారిస్తున్నామని పోలీసు అధికారులు వివరించారు.