పెళ్లి-మోసం: టెక్కీనంటూ ఎన్నారై యువతికి రూ.30 లక్షల టోకరా
తాను టెక్కీనంటూ ఎన్నారై యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: నగరంలో మరో ఎన్నారై మోసం వెలుగు చూసింది. తాను టెక్కీనంటూ ఎన్నారై యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతిని సోషల్ మీడియా ద్వారా నగరానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు పరిచయం చేసుకున్నాడు. తాను కూడా అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానంటూ ప్రేమ వ్యవహారం నడిపాడు. వారి పరిచయం పెరగడంతో పెళ్లి చేసుకోవాలన్న నిశ్చయానికి వచ్చారు.

కాగా, తనకు ఆరోగ్యం బాగోలేదని.. నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరానని చెప్పాడు. అంతేగాక,
తన వైద్య ఖర్చుల కోసం రూ. 30లక్షల కావాలని సదరు యువతిని కోరాడు ప్రశాంత్. దీంతో అతని మాటలు నమ్మిన యువతి.. రూ.30లక్షలను అతని ఖాతాకు బదిలీ చేసింది. ఆ తర్వాత ప్రశాంత్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి చూడాలని ఆమె తన తల్లిదండ్రులను కోరింది.
ఆస్పత్రికి వెళ్లి విచారించగా.. అలాంటి వ్యక్తి ఎవరూ ఆస్పత్రిలో చేరలేదని ఆమె తల్లిదండ్రులకు అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆమె తల్లిదండ్రులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి నిందితుడు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications