'అంధ్రావాడివంటూ అప్పాలో అవమానం': ఫిర్యాదు చేశామన్న డిజిపి
హైదరాబాద్/విజయవాడ: అప్పా డిఐజిని తెలంగాణ సిఎస్ దూషించిన వ్యవహారంపై తాము గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశామని ఏపీ డిజిపి జెవి రాముడు బుధవారం చెప్పారు. పదిహేను రోజుల్లో విజయవాడలో డిజిపి క్యాంప్ ఆఫీస్ సిద్ధమవుతుందని చెప్పారు.
ప్రస్తుతానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఆఫీసర్స్ క్లబ్లో క్యాంప్ కార్యాలయం, నివాసంగా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు.
పోలీసు శాఖ నూతన భవనాలకు రూ.7వేల కోట్లు అవసరమని, భవనాల నిర్మాణాలకు వివిధ ప్రాంతాల్లో 3,300 ఎకరాలను పరిశీలిస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ‘ఏమయ్యా... నువ్వెందుకు రిలీవ్ అవలేదు? ఆంధ్రా వాడివి నీకిక్కడేం పని? అని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ నలుగురిలో కోప్పడ్డారు. పలువురు ఐఏఎస్ల ముందే నన్ను అవమానించారు'' అంటూ ఏపీకి చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర రావు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ సంఘటన హైదరాబాద్ శివార్లలోని హిమాయత్సాగర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడెమీ.. అప్పాగా పిలిచే దీనిని, మూడు దశాబ్దాల కిందట ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇక్కడికి తరలించారు. సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాల పోలీసులకూ ఇక్కడే శిక్షణ ఇచ్చేవారు.
రాష్ట్ర విభజన తర్వాత అప్పాను పదో షెడ్యూల్లో చేర్చారు. ఇరు రాష్ట్రాలూ పదేళ్లపాటు దీన్ని ఉపయోగించుకోవచ్చని చట్టంలో ఉంది. రాష్ట్ర విభజన నాటికి ఏపీ కేడర్కు చెందిన అదనపు డీజీ మాలకొండయ్య అప్పాకు డైరెక్టర్గా ఉన్నారు. ఆయన కొనసాగుతుండగానే, విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ పేరును తెలంగాణ పోలీస్ అకాడెమీగా మార్చి ఈశ్ కుమార్ను డైరెక్టర్గా నియమించింది.