అమర్నాథ్ యాత్రలో 'ఉగ్ర' కలకలం?: బాంబు దాడిపై దాటవేత, కరీంనగర్ వాసి మృతి
అమర్నాథ్ యాత్రలో ఉన్న తెలుగువారి బస్సులో పేలింది సిలిండర్ కాదా.. వాళ్లమీద బాంబుదాడి జరిగిందా? బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం రెండోదే నిజమని తెలుస్తోంది.
న్యూఢిల్లీ/ హైదరాబాద్ : అమర్నాథ్ యాత్రలో ఉన్న తెలుగువారి బస్సులో పేలింది సిలిండర్ కాదా.. వాళ్లమీద బాంబుదాడి జరిగిందా? బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం రెండోదే నిజమని తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి 47 మంది యాత్రను ముగించుకుని తిరుగు పయనమయ్యారు.
జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ నగరానికి దగ్గరలోని గాజికొండు వద్ద భోజనాల కోసం వాహనం ఆపారు. తిరిగి బయలుదేరుతున్నప్పుడు జరిగినట్లు సమాచారం. దీంతో ఈ ప్రమాదంపై గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పాలని ప్రయాణికులకు ఆర్మీ అధికారులు హితబోధ చేశారని తెలుస్తోంది.
భోజనాలు చేసి, అంతా బస్సులో కూర్చున్న తర్వాత ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలుడు సంభవించిందని, ఏం జరిగిందో తెలిసేలోపే కరీంనగర్ జిల్లావాసి శంకర్ పంతులు ప్రాణాలు కోల్పోయారని, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయని గాయపడిన వ్యక్తి చెప్పారు. వీరిని శ్రీనగర్ ఆర్మీ ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.
కాళ్లు, చేతులకు దెబ్బలు తగిలినవారు కట్లు కట్టించుకుని తిరిగి సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్దకు వచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆర్మీ ఉన్నతాధికారులు, శ్రీనగర్ కలెక్టర్ అక్కడి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అందరితో మాట్లాడి విషయం బయటకు చెప్పొద్దని, సిలెండర్ పేలిందని చెప్పమన్నట్లు తెలుస్తోంది.
అమర్ నాథ్ యాత్రపై వెంటనే స్పందించిన తెలంగాణ సర్కార్
చనిపోయిన వ్యక్తి పేరు మురళి అని అధికారులు చెప్పగా, బాధితులు మాత్రం శంకర్ పంతులు అంటున్నారు. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ వెంటనే స్పందించింది. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేలా సహాయ చర్యలు చేపట్టాలని ఢిల్లీ టీఎస్ భవన్ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అక్కడి పరిస్థితిని తెలుసుకుని కామారెడ్డి కలెక్టర్కు, విప్ గంపా గోవర్ధన్కు సమాచారం అందించారు. క్షతగాత్రులను సురక్షితంగా విమానంలో ఢిల్లీకి చేర్చాలని తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎస్, జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. కాజిగూడ సీఆర్పీఎఫ్ బేస్క్యాంప్లో వైద్యం పొందుతున్న వీరిని ఢిల్లీకి తరలించాలని కోరారు. జమ్ముకశ్మీర్ అధికారులతో సంప్రదింపులు జరపాలని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ను ఆదేశించారు. మృతదేహాన్ని కూడా తరలించాలని కోరారు.
Recommended Video
క్షతగాత్రులకు శ్రీనగర్ ఆసుపత్రుల్లో చికిత్స
అమర్నాథ్ ఘటనలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల యాత్రికులు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కామారెడ్డి వాసులు జయంతి, ఎస్ లక్ష్మి, బెజుగం పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంత్నాగ్ ఆస్పత్రిలో నిజామాబాద్కు చెందిన అశోక్, కామారెడ్డి జిల్లా వాసులు జంగం భైరయ్య, జంగం పుష్ప, బెజుగం మురళీధర్ కూడా చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్లోని కుచ్కుండి ఆసుపత్రిలో కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన జంగం ప్రభాకర్స్వామి, ఆయన భార్య జయంతి, పుష్ప చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలైన ముగ్గురిని శ్రీనగర్లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
జమ్ము కశ్మీర్ అధికారులతో పోచారం సంప్రదింపులు
బాధితుల కుటుంబసభ్యులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. తమవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించి స్వస్థలానికి తీసుకువచ్చేలా అక్కడివారితో మాట్లాడాలని కోరారు. దీంతో మంత్రి పోచారం, కలెక్టర్, జమ్ము కాశ్మీర్ ప్రభుత్వంతో, అధికార వర్గాలతో ఫోన్లో మాట్లాడి ఉమ్మడి జిల్లా వాసుల వివరాలను అడిగి తెలుసుకుని, ఆ వివరాలు చెప్పారు. అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందినవారు క్షేమంగానే ఉన్నారని.. వారిని శనివారం లోపు కామారెడ్డి, నిజామాబాద్కు తీసుకొచ్చేలా కృషి చేస్తామని కుటుంబ సభ్యులకు మంత్రి, కలెక్టర్ సత్యనారాయణ హామీ ఇచ్చారు.