జగ్గారెడ్డి సంచలన నిర్ణయం : ఓటుకు నోటుపై తాజాగా - చంద్రబాబు సైతం: టార్గెట్ రేవంత్..!!
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి ముసలం మొదలైంది. పార్టీ నేత జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు తన నిర్ణయం అధికారికంగా ప్రకటించేందుకు సిద్దమయ్యారు. కొద్ది నెలల క్రితం వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో జగ్గారెడ్డి విభేదిస్తూ వచ్చారు. అయితే, ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ నేతలు సమావేశం అయిన తరువాత విభేదాలు తగ్గుముఖం పట్టాయి. జగ్గారెడ్డి సైతం తన కుటుంబ సభ్యులతో పాటుగా రాహుల్ గాంధీని కలిసారు. పార్టీలో ఏ సమస్య వచ్చినా నేరుగా తనకే చెప్పాలని..మీడియాకు ఎక్కవద్దంటూ రాహుల్ సూచించారు. దీనికి జగ్గారెడ్డి సైతం అంగీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ తో కలిసే కొనసాగుతున్నారు.
సిన్హా పర్యటన వేళ మరో వివాదం
తాజాగా, రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లో పర్యటించారు. ఆ సమయంలో తొలుత సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. కేసీఆర్ తో సమావేశమైన తరువాత తాము సిన్హాతో సమావేశం అయ్యేది లేదని రేవంత్ తేల్చి చెప్పారు. దీనిని జగ్గారెడ్డి వ్యతిరేకించారు. జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తూ.. రాష్ట్రానికి వచ్చిన వేళ కలవకపోవటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.
అయితే, సిన్హా బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన సమయంలో పార్టీ సీనియర్ నేత వీహెచ్ వ్యక్తిగతంగా వెళ్లి కలిసారు. దీనికి రేవంత్ తప్పు బట్టారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండని వారిని గోడకేసి బాదాలంటూ వ్యాఖ్యానించారు. దీని పైన సీరియస్ గా రియాక్ట్ అయిన జగ్గారెడ్డి...వీహెచ్ వయసు ఎంత.. నీ వయసు ఎంత.. నీ ఇంట్లో జీతాళ్లమనుకుంటున్నావా..అంటూ వ్యాఖ్యానించారు.
రేవంత్ వ్యాఖ్యల పై ఆగ్రహం
అంత టెంపర్ ఉన్నవాడికి అసలు పీసీసీ చీఫ్ గా ఎలా పని చేస్తావంటూ నిలదీసారు. ఇక, ఇప్పుడు తాజాగా జగ్గారెడ్డి ఒక లేఖ విడుదల చేసారు. రేపు కీలక నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు. రేవంత్ కు వ్యూహం లేదని.. పార్టీని నడిపించాలంటే వ్యూహాలు ఉండాలని పేర్కొన్నారు. గతంలో టీడీపీలో రేవంత్ పని చేసిన సమయంలో ఇదే రకంగా ఓటుకు నోటు లో వ్యవహరించారని చెప్పుకొచ్చారు. రేవంత్ కారణంగా ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం వదిలి వెళ్లాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. తాను గతంలో రాహుల్ కు ఏ సమస్య ఉన్నా వివరిస్తానని మాట ఇచ్చానని.. ఇప్పుడు ఆ మాట తప్పుతున్నందుకు బాధగా ఉందంటూ వివరించారు.
సంచలన నిర్ణయం తీసుకుంటానంటూ
ఇక, ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. తాజాగా, సిన్హా పర్యటన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటుగా పార్టీ నిర్ణయాన్ని కాదని వీహెచ్ వెళ్లి సిన్హాను కలిసిన అంశం పైన రేవంత్ సీరియస్ చర్యల దిశగా చర్చలు చేయనున్నట్లు సమాచారం. ఇక, పార్టీలోకి కొత్తగా చేరికల అంశం పైన పార్టీ ముఖ్యనేతలతో రేవంత్ చర్చలు చేస్తారని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రేవంత్ - వీహెచ్ - జగ్గారెడ్డి ఎపిసోడ్ చర్చకు కారణమవుతోంది. మరి..జగ్గారెడ్డి సంచలన నిర్ణయం పైన గతంలో చేసిన విధంగానే వెనుడగు వేస్తారా..లేక, నిర్ణయాన్ని ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి.