పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య: ఇంట్లో ఎవరూ లేని సమయంలో!
హైదరాబాద్: పరీక్షల పట్ల ఉన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని ఏవీబీ పురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అజయ్కుమార్, ధనలక్ష్మిల ఏకైక సంతానమైన ఎన్.ప్రభావతి(15) స్థానిక సెయింట్రీటా స్కూల్లో పదో తరగతి చదువుతంోది. తండ్రి కారు డ్రైవర్గా పనిచేస్తుండగా తల్లి ఓ ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూల దుకాణం నిర్వహిస్తున్నారు.
మంగళవారం మధ్యాహ్నాం అజయ్కుమార్, ధనలక్ష్మిలు బంధువుల ఇంటికి వెళ్లడంతో.. ఇంట్లో ప్రభావతి ఒక్కరే ఉంది. బుధవారం మధ్యాహ్నాం ఆమె తోటి విద్యార్థులు ఇంటికి వచ్చారు. తలుపు కొట్టినా ప్రభావతి తీయకపోవడంతో.. వెనుక గది తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లారు.
అప్పటికే ప్రభావతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. ఆత్మహత్యకు ముందు ఒక లేఖ రాసినట్టు పోలీసులు గుర్తించారు. 'పరీక్షలంటే నాకు భయం. ఎంత చదివినా ఫిజిక్స్, మ్యాథ్స్ అర్థం చేసుకోలేకపోతున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను' అని ప్రభావతి ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.