మోడీ! యశోదాకు న్యాయం చేయండి: 8రోజులుగా హైదరాబాద్ మహిళ దీక్ష
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తన భార్య యశోదా బెన్(జశోదాబెన్)కు న్యాయం చేయాలంటూ నగరానికి చెందిన వైద్యురాలు పాలెపు సుశీల చేస్తున్న దీక్షను మియాపూర్ పోలీసులు భగ్నం చేశారు. యశోదాను మోడీ తన భార్యగా అంగీకరించి గౌరవించాలని, లేదంటే.. జెడ్ కేటగిరి భద్రత తొలగించి ఆమెకు స్వేచ్చ ప్రసాదించాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తోంది సుశీల.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా నీరసించినపోయిన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, తాను మాత్రం తన డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా దీక్ష విరమించబోనని సుశీల సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.
అందుకే దీక్ష
అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలిగా ఉన్న డాక్టర్ పాలెపు సుశీల.. హైదరాబాద్ మియాపూర్లోని న్యూ హఫీజ్ పేటలో క్లినిక్ నడుపుతున్నారు. హైందవ జీవన విధానంలో మహిళ పూజ్యనీయురాలని, స్త్రీల గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడటం కోసమే తాను దీక్షకు దిగినట్లు సుశీల తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు. యశోదాబెన్ కు న్యాయం చేయాలంటూ దీక్ష చేశారు.
బ్రిటీష్ వాళ్లే నయమంటూ..
కాగా, దీక్ష భగ్నం అనంతరం ప్రధానిని ఉద్దేశించి డాక్టర్ సుశీల ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం పోరాడుతుంటే తనను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక, ‘మానవత్వమేలేని మనుషులకు దేశం మనుషులు పట్టని నాయకులకు బ్రిటిష్ వాళ్ళే కరక్ట్' సోషల్ మీడియాలో అని వ్యాఖ్యానించారు.
సుశీలకు నెటిజన్ల హితవు
కాగా, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉన్నందునే యశోదా బెన్కు భద్రత కల్పిస్తున్నారని, ఈ విషయంలో దీక్షలు అవసరం లేదని నెటిజన్లు సుశీలకు హితవు పలుకుతున్నారు. కొందరైతే ప్రచారం కోసం ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తున్నారు.
బాల్యంలోనే పెళ్లి.. అప్పుడే..
ఇది ఇలావుంటే.. బాల్యంలోనే యశోదను పెళ్లాడిన నరేంద్ర మోడీ.. అనంతరం కొద్ది రోజులకే ఆమె నుంచి దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఆమెను ఉన్నత చదువులు అభ్యసించాలని సూచించి ఆమెకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మోడీ రాజకీయాల వైపు, ఆమె ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయ్యారు. గత కొంతకాలం క్రితం రిటైరైన ఆమె సొంత సోదరుల వద్దే ఉంటున్నారు.