మాతోపాటు 40మందిని గెలిపిస్తాం: పార్టీ మారడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని తప్పుబట్టారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ ప్రజలను మోసం చేశారని కోమటిరెడ్డి విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి, నల్గొండ నుంచి తాను పోటీ చేస్తామని తెలిపారు.
శుక్రవారం సాయంత్రం నుంచే ప్రచారం ప్రారంభిస్తామని కోమటిరెడ్డి చెప్పారు. తాము గెలవడమే కాదు, 40మందిని గెలిపించే సత్తా తమకుందని అన్నారు. ఎన్నికల్లో గెలవలేననే భయంతోనే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారని అన్నారు.
అంతేగాక, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఖాయమని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. కాగా, సురేష్ రెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.