కేటీఆర్ ప్రమేయంతోనే డ్రగ్స్, అప్పుడు పబ్బులు ఆరేడు, ఇప్పుడు 57: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడైన మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే డ్రగ్ వ్యాపారానికి కేంద్ర బిందువులైన పబ్లను హైదరాబాద్ లో యధేచ్చగా నడిపిస్తున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ఆరోపిం
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరేడు పబ్బులు హైదరాబాద్లో ఉంటే ఈ మూడేళ్లలోనే మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే కొత్తగా 57 పబ్బులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను నియంత్రించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ట్యాంక్బండ్ నుంచి ఎక్సైజ్కార్యాలయానికి సోమవారం పాదయాత్రను తలపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్రెడ్డి మాట్లాడారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిషేధం విధించిన ఫ్రెంచ్ డీజేకు రాష్ట్రమంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులు స్వాగతం పలికారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడైన మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే డ్రగ్ వ్యాపారానికి కేంద్ర బిందువులైన పబ్లను యధేచ్చగా నడిపిస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు.
వీటికి సంబంధించిన ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ ఇలాంటి డీజేలను నిర్వహిస్తున్నాడని చెప్పారు.
డ్రగ్ మాఫియాలో పెద్దపెద్ద వారున్నారని, వారి పేర్లను బయటపెట్టొద్దని తనపై ఒత్తిళ్లు వస్తున్నట్టుగా విచారణాధికారి ఆకున్ సబర్వాల్ పేర్కొనడాన్ని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కుటుంబసభ్యులు తప్పులు చేసినా శిక్షిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలను కూడా ఎదిరించే విధంగా వచ్చిన బెదిరింపులు ఎవరివో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయం వెళ్లడానికి ప్రయత్నించిన టీటీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.