కేటీఆర్ బావమరిదినంటూ బెదిరింపులు: ఐటీ కంపెనీనే తన పేరిట రాయాలని వేధింపు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బావమరిదినంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, తమ కంపెనీని తన పేరున రాయాలని బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఓ ఐటీ సంస్థ నిర్వాహకులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను బుధవారం ఆశ్రయించారు. తమ కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు డబ్బులను డిమాండ్ చేస్తూ.. తమను వేధింపులకు గురిచేస్తున్న ఆ వ్యక్తి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
ఈ మేరకు రాయదుర్గంలోని ఎటర్నల్ క్వెస్ట్ ఐటీ సర్వీసెస్ సంస్థ భాగస్వాములు నెల్లూరుకు చెందిన బోయిళ్ల సాయిచరణ్, మార్కాపురంకు చెందిన అరటోలు అభిషేక్లు ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన కమిషన్ అక్టోబరు 4లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని మాదాపూర్ ఏసీపీకి నోటీసులు జారీ చేసింది.
తమ ప్రాజెక్టు మేనేజర్ వంశీధర్ సహకారంతో ఒక ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని, నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేటర్గా వెంకటస్వాయి, అవినాష్ను నియమించుకున్నామని బాధితులు వివరించారు. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవని, కొంత కాలంగా కంపెనీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు.
ఈ క్రమంలో వంశీకృష్ణారావు ముతినేని అలియాస్ వంశీరావు అనే వ్యక్తి ఫోన్చేసి అసభ్యపదజాలంతో మాట్లాడటంతో పాటు తాను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బామ్మర్దినంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదంటూ దూషించాడని చెప్పారు.
జీతాలు త్వరలో చెల్లిస్తామని చెబుతున్నా వినిపించుకోకుండా ఇటీవల పోలీసు సైరన్తో ఉన్న కారు(ఏపీ29డిఎస్ 00005)లో కార్యాలయంలోకి దూసుకొచ్చి రాయదుర్గం పోలీసు ఠాణాకు తీసుకెళ్లాడని పేర్కొన్నారు. అక్కడ పోలీసులతో బెదిరింపచేశాడని, అక్కడినుంచి తన కారులోనే తీసుకెళుతూ తుపాకి గురిపెట్టి తాను చెప్పింది వినకపోతే చంపేస్తానంటూ బెదిరించి రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడని బాధితులు వివరించారు. తమకు ఆ వ్యక్తి నుంచి రక్షణ కల్పించాలని సాయిచరణ్, అభిషేక్లు హెచ్చార్సీని వేడుకున్నారు.