ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి చేదు అనుభవం... అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై అభ్యంతరం...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి చేదు అనుభవం ఎదురైంది.అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయదుర్గంలోని లెదర్ ఇన్స్టిట్యూట్లో ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్ ప్రారంభోత్సవంలో సురభి వాణీదేవి పాల్గొనగా... శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ,ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి,కట్టెపల్లి జనార్దన్ రెడ్డి,గోరటి వెంకన్నలతో కలిసి సురభి వాణీ దేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించగా... అందులో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గోరటి వెంకన్న,జనార్దన్ రెడ్డి పేర్లు మాత్రమే ఉన్నాయి. సురభి వాణీదేవి పేరు లేకపోవడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీనిపై అధికారుల నుంచి వివరణ కోరారు. వెంటనే శిలాఫలకంలో సురభి వాణీదేవి కూడా పేరు చేర్చి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన సమీప బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుపై 11,703ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీంతో బీజేపీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,37,566 ఓట్లు వచ్చాయి. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.
దుబ్బాక,జీహెచ్ఎంసీ మినహా అంతకుముందు జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం మాత్రం ఆ పార్టీకి అందకుండా ఉండిపోయింది. గతంలో ఇక్కడినుంచి టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగా దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తెను ఇక్కడినుంచి బరిలో దింపడం కలిసొచ్చింది. అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం చేసినా... బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టడంతో విజయం టీఆర్ఎస్నే వరించింది.
నిజానికి సురభి వాణీదేవీకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కేసీఆర్ ఆమెను బలిపశువును చేయబోతున్నారన్న విమర్శలు వినిపించాయి. అక్కడ టీఆర్ఎస్కు బలం లేదని తెలిసే సురభి వాణీదేవికి టికెట్ ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ విమర్శలను పటాపంచలు చేస్తూ సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావుపై ఆమె విజయం సాధించారు