బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. రాళ్ళదాడి; భగ్గుమన్న బండి సంజయ్!!
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నల్గొండ, భువనగిరి జిల్లాలు దాటి ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. నేడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లో బండి సంజయ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్ర లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యోగాలపై బండి సంజయ్ ను ప్రశ్నించారు. దీంతో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ
ఇక ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాటకు దారితీయడంతో ఒక్కసారిగా దేవరుప్పుల మండలం లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడంతో, ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. మరి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గూండాల్లా .. బీజేపీ ఫైర్
ఇదిలా ఉంటే దేవరుప్పుల లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారని దాడికి పాల్పడ్డారని బిజెపి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకపక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు జరుగుతుంటే, మరో పక్క టిఆర్ఎస్ పార్టీ గుండాలు దాడులకు తెగబడ్డారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు బిజెపి కార్యకర్తలకు రాళ్ల దాడిలో తీవ్రగాయాలు కావడంతో, ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ కమీషనర్ పై బండి సంజయ్ ఫైర్... డీజీపీకి ఫోన్
పోలీస్ కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ లా అండ్ ఆర్డర్ చేతగాని సిపి ఇంట్లో కూర్చోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక డీజీపీతో నేరుగా మాట్లాడిన బండి సంజయ్ బిజెపి కార్యకర్తల తలలు పగలగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక పోలీసులకు జీతాలు కెసిఆర్ జేబులో నుంచి ఇస్తున్నారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో కెసిఆర్ ఉండేది ఇంకో ఆరు నెలలు మాత్రమే అని బండి సంజయ్ పేర్కొన్నారు.

తర్వాత పరిణామాలకు బాధ్యత మీదే.. డీజీపీకి బండి సంజయ్ డెడ్ లైన్
తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని బండి సంజయ్ పేర్కొన్నారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు. వెంటనే స్పందించాలని లేదంటే, గాయపడిన కార్యకర్తలను తీసుకొని మీ వద్దకు వస్తానని డీజీపీ కి బండి సంజయ్ డెడ్ లైన్ పెట్టారు. ఇక ఇదే సమయంలో దేవరుప్పుల ఘటనతో బండి సంజయ్ తనకు పోలీసులు ఇచ్చిన సెక్యూరిటీని నిరాకరించారు. భద్రతా సిబ్బందిని సైతం ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. నా భద్రతను మా కార్యకర్తలే చూసుకుంటారు అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications