తీజ్ పండుగలో ఎంపీ కవిత: ఉయ్యాల ఊగారు (ఫోటోలు)
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కవిత సోమవారం నిజమాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల పరిరక్షణలో ప్రపంచంలో ఆస్ట్రేలియా తొలిస్థానంలో, చైనా రెండో స్థానంలో ఉండగా, భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదని ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు.

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎంపీ
సోమవారం నిజామాబాద్ నగరంలో కాలూర్, బైపాస్ రోడ్డులో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఎంపీ మొక్కలు నాటారు. శ్రద్ధానంద్గంజ్లో మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

తీజ్ వేడుకలో పాల్గొని మాట్లాడుతున్న కవిత
నర్సింగ్పల్లి పరిధిలోని కాస్బాగ్తండాలో తీజ్ వేడుకలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం మహాయజ్ఞంలా సాగుతున్నదని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

ఈ-ట్రేడింగ్ మార్కెట్ ద్వారా లాభాలు
ఉమ్మడిరాష్ట్రంలో అరవై ఏళ్లలో తెలంగాణలో గోదాముల నిర్మాణానికి రూ.80 కోట్లు విడుదలైతే, స్వరాష్ట్రంలో రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఈ-ట్రేడింగ్ మార్కెట్ ద్వారా లాభాలు ఆర్జిస్తున్న మార్కెట్లలో జిల్లా ముందుండడం మంచి పరిణామమన్నారు.

తండాలను గ్రామ పంచాయితీలుగా గుర్తిస్తాం
500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీంతో తండాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

కవిత వెంట టీఆర్ఎస్ నేతలు
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ నగర మేయర్ సుజాత, జిల్లా కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ విశ్వప్రసాద్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఏఎస్ పోశెట్టి, బాపురెడ్డి, లక్ష్మణ్రావు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ భరద్వాజ్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications