టీడీపీ నేత పట్టాభిపై దాడికి కారణాన్ని వెల్లడించిన విజయసాయి రెడ్డి: గుళ్లను కూల్చేసిన వాళ్లే
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్పై విజయవాడలో చోటు చేసుకున్న దాడి.. రాజకీయంగా కలకలం రేపుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడ నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.
జగన్ విసిరే బిస్కెట్ల కోసం కక్కుర్తి పడుతోన్న బాడుగ నేతలు: ఉద్యోగ సంఘాల నేతలపై పట్టాభి ఫైర్
పట్టాభిపై దాడి వెనుక కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతల హస్తం ఉందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దీన్ని తిప్పి కొడుతోంది వైసీపీ. పట్టాభిపై దాడి చేయడం వెనుక తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉందని ఎదురుదాడికి దిగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు ఈ దాడుల నాటకానికి తెర తీశారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేస్తోన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి పట్టుబట్టిన చంద్రబాబుకు పరాభవం తప్పట్లేదని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ రంకెలేసిన చంద్రబాబుకు పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకట్లేదని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. అభ్యర్థులు దొరక్క చంద్రబాబు కళ్లు తేలేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పరాభవం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దాడులకు కుట్ర పన్నారని మండిపడ్డారు.
Recommended Video
తన పార్టీ నాయకుల మీద తానే దాడులు చేయించే కుట్రలను మొదలుపెట్టారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలను కూల్చిన చంద్రబాబుకు ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయని విజయసాయి రెడ్డి అన్నారు. కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో దేవాలయాలను కూల్చేశారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబుకు భౌతిక దాడులు చేయించాలనే ఆలోచనలే వస్తాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా.. ఎన్నికల్లో తమ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేదని చెప్పారు.