కాంగ్రేస్ కలల్లోకి ఎన్టీఆర్
బాబుకీ, బాలకృష్ణకీ, వాళ్ళ మహాకూటమికి భయపడని కాంగ్రెస్ అగ్ర నాయకులు జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలకు లభిస్తున్న జనాదరణ చూసి బెంబేలెత్తుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రభంజనానికి అడ్డుకట్టవేయడానికి ఏ వ్యూహం వేయాలని కాంగ్రెస్ మేధావులు ఆలోచిస్తున్నారు. వారు దీనిని సీరియస్ విషయంగా పరిగణించి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డీని ఒక రోజు ముందుగానే ఢిల్లీ నుంచి రప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం మీద వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ మేధావుల మేధో మధనం నిన్న కొంత సేపు జరగగా ఆదివారం కూడా ఇదే విషయంపై మంతనాలు జరుగుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలకు వస్తున్న జనం పూర్తిగా తెలుగుదేశం ఓటర్లుగా మారే అవకాశం లేదని, మొదటి సారిగా జనం మధ్యలోకి వచ్చిన ఆ యువ హీరోను చూడడానికి జనం వస్తున్నారని కొందరు కాంగ్రెస్ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం జూనియర్ ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని అంటున్నారు.
నిన్న జూనియర్ ఎన్టీఆర్ కు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఒక బహిరంగలేఖ రాసింది. ఆ లేఖను అన్ని పత్రికలు పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రచురించగా "సాక్షి" లో అది ఏకంగా బ్యానర్ న్యూస్ అయింది. ఎన్టీఆర్ ను కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని తెలుగుదేశం మేధావులు ప్రశ్నిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికలు ముగిసేవరకు ఏకధాటిగా రాష్ట్రంలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి కనీసం మూడు శాతం ఓట్లు అదనంగా వచ్చినా ఫలితాలు తారుమారై తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోని తెలుగుదేశం మేధావుల అంచనా.
ఒక విషయం మాత్రం స్పష్టం. జూనియర్ ఎన్టీఆర్ అంత చిన్న వయసులో ఎంతో పరిపక్వతతో మాట్లాడుతున్నాడు. ఎనర్జీ తొణికిసలాడుతోంది. మాటల్లో స్పష్టత ఉంది. విమర్శల్లో పదును ఉంది. మంచి బాడీ లాంగ్వేజి ఉంది. ఈ కుర్రాడు ఏదో చేయబోతున్నాడన్న అభిప్రాయం జనంలో కలిగే అవకాశముంది.
ఒకటే మైనస్.. మామ చంద్రబాబు నాయుడు. ఆయన హయాంలో సామాన్యజనం పడిన బాధలు ఎక్కువే. ఆ బాధలను జనం మర్చిపోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు మైనస్ పాయింట్లను తన ప్లస్ ద్వారా జూనియర్ ఎలా కవర్ చేయగలడన్నదే ఇప్పటి చర్చనీయాంశం.