చిరంజీవి వ్యూహం: రామచంద్రయ్య వంత
గతంలో కూడా పలుమార్లు సి.రామ చంద్రయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో జరిగిన వైఫల్యాలను సరిదిద్దుకుంటూ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గాన్ని సమీకరించి ముఖ్మయంత్రి పదవికి గాలం వేస్తున్నారా అనే చర్చ సాగుతోంది. కేంద్ర పర్యాటకశాఖ స్వతంత్ర ప్రతిపత్తి మంత్రి హోదాలో ఉన్న చిరంజీవి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అత్యధిక నిధులు కేటాయిస్తున్నారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొనే ఆయన నిధులు కేటాయింపులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీకి స్టార్ ఇమేజ్ ఉన్న నేత చిరంజీవి మాత్రమేనని ఆయన వర్గం వాదిస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసి ముఖ్యమంత్రి పదవికి వల వేసే వ్యూహాన్ని చిరంజీవి పదునుపెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే చిరంజీవి సన్నిహితుడు మంత్రి సి.రామచంద్రయ్య వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర పర్యాటకాభివృద్ధిపై కేంద్ర మంత్రి హోదాలో చిరంజీవి ప్రత్యేక శ్రద్ధకనబర్చుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నారు.
తద్వారా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చిరంజీవి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న భావన రాష్ట్ర ప్రజానీకంలోనూ, పార్టీ నేతలలోనూ, తద్వారా పార్టీ అధిష్టానానికి చిరంజీవి సంకేతాలు పంపే యత్నం చేస్తున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏకమవుతున్న అసమ్మతిని కూడా తనకు అనుకూలంగా మల్చుకొనే యత్నంలో చిరంజీవి వర్గం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, పర్యాటక శాఖ మంత్రిగా తాను రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చిరంజీవి దూరంగా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును అధికారంలోకి తీసుకురావడం చిరంజీవి వల్లనే సాధ్యమవుతుందని అధిష్టానానికి నమ్మకం కలిగించడానికి ఆయన వర్గం విశేషంగా కృషి చేస్తోందని అంటున్నారు.