విభజన తప్పదంటే...: పురంధేశ్వరి డిమాండ్స్!
న్యూఢిల్లీ: తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, విభజన తప్పనిసరైతే మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చాలని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల మంత్రుల బృందం (జివోఎం) ముందు డిమాండ్ల నివేదికను ఉంచారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్ర సమస్యలన్నింటిని పరిష్కరించాలని, ప్రజల భయాందోళనలకు పరిష్కారం చూపించాలని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనతో ప్రధానంగా నదీ జలాల సమస్య ఉత్పన్నమవుతుందని, కృష్ణా నదీ జలాల కేటాయింపులు జరిగిపోయాయని ఇప్పటికే ప్రణాళికా సంఘంతోపాటు, కేంద్ర జల వనరుల శాఖ సూచిస్తున్న నేపథ్యంలో విభజనతో పలు అనర్థాలు, అవస్థలను ఎదుర్కొనాల్సి వస్తుందని ఆమె వివరించారు. ప్రధానంగా మిగులు జలాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, వీటిని పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు.
రాష్ట్రం రెండుగా విడిపోయాక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నదీ జలాల అథారిటీని ఏర్పాటు చేయాలని, ఇది స్వతంత్రంగా, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేయాలన్నారు. కృష్ణా, గోదావరి నికర జలాల విషయంలో ఇరు రాష్ట్రాల హక్కులను పరిరక్షించాల్సిందేనని కేంద్రాన్ని కోరారు. పోలవరం డిజైన్లను కేంద్ర జలవనరుల సంఘం రూపొందించిందని, దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
భద్రాచలం అంతటినీ కాకున్నా పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో విలీనం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉండే అవాంతరాలను తొలగించవచ్చని వివరించారు. నదుల అనుసంధానం అంశాన్ని దీర్ఘంగా ఆలోచిస్తున్న సమయంలో పోలవరం నిర్మాణం అవశ్యమని స్పష్టం చేశారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నందున ఈ విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జీవోఎంకు పురందేశ్వరి వివరించారు.
సీమాంధ్ర రాజధానిపై ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ బోర్డు రహదారి, సముద్రయానం, విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు. రాజధాని నగరానికి 25 కిలో మీటర్ల పరిధిలో పరిశ్రమల ఏర్పాటును నిరోధిస్తూ ప్రత్యేక జోన్గా ప్రకటించాలని వివరించారు. సీమాంధ్రలో వ్యవసాయాధారిత పరిశ్రమలతోపాటు మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు ప్రత్యేక రాయితీలతో కూడిన సదుపాయాలు కల్పించాలని చెప్పారు.
పరిశ్రమలకు రాయితీలు కొనసాగించాలని కోరారు. నిరుద్యోగులకు ఉపయోగపడేలా విశాఖపట్నంలో వాల్తేరు జోన్ను ఏర్పాటు చేయాలని, విశాఖ ప్రధాన కార్యాలయంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లతో ఒక డివిజన్ను, తిరుపతిని ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని సూచించారు.
విశాఖ విమానాశ్రయం రక్షణ శాఖ ఆధీనంలో ఉందని, దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సిటీ స్థాయికి పెంచాలని, అలాగే, ఐఐటి, ఐఐఎం, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించాలని తెలిపారు. హైదరాబాద్ పరిసరాల్లో నాలుగు వందలకు పైగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నందున వాటిని సీమాంధ్రలోను ఏర్పాటు చేయాలని కోరారు. సిసిఐఆర్ను సీమాంధ్రలో ఏర్పాటు చేయాలన్నారు.