తుమ్ములతో ముక్కు కారుతూంటే ...తాగండి వేడి చికెన్ సూప్!
తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి లేదా స్కూళ్లకు వెళ్ళడం సరైంది కాదు. అలాగే తల, శరీరం నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నపుడు, తుమ్ములతో జలుబు మొదలైనపుడు పారాసిటమాల్ వంటి బిళ్ళలు, వేపోరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదు.
ఆయా సీజన్లలో వచ్చే జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా కూడా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసి తుమ్మినపుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకేట్లు చేస్తాయి. అందుకని జలుబు చేసినపుడు బయటకు వెళ్ళి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెపుతారు.
జలుబు సాధారణంగా 7 నుంచి 12 రోజులలో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వేడి నీటిలో పసుపు లేదా ఏదైనా బామ్ వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
చీదినప్పుడు, దగ్గినపుడు రక్తం పడుతోందా...అని కూడా గమనించాలి. అలా రక్తం కనుక పడితే అది తీవ్రమైన జబ్బుగా గమనించాలి. స్వల్పంగా తలనొప్పి, జలుబు అయినపుడు తగినంత విశ్రాంతి అన్నిటికంటే మంచిది.