చంద్రబాబును మళ్లీ ఆడిపోసుకున్న వైయస్ జగన్
వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లాలని మాత్రమే చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ మరణించిన తర్వాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రైతు సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.
అనర్హత వేటు పడుతుందని తెలిసి కూడా తనకు మద్దతుగా నిలిచి, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన శాసనసభ్యులకు ఆయన హ్యాట్సాఫ్ చెప్పారు. ఉప ఎన్నికలకు సిద్ధపడి వారు రైతుల కోసం అవిశ్వాసానికి ఓటేశారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాయచోటి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డే పోటీ చేస్తారని ఆయన చెప్పారు. శ్రీకాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.